
Gig Workers: గిగ్ రంగంలో అసమానతలు.. పరిష్కారాలకు.. వీవీ గిరి లేబర్ ఇన్స్టిట్యూట్ 'విజన్-2047' నివేదిక సిఫార్సులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో గిగ్,ప్లాట్ఫార్మ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ వివక్షలేకుండా సమాన వేతనం, సమాన పని గంటలు కల్పించాల్సిన అవసరం ఉందని వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ సూచించింది. ఈ రంగానికి చెందిన కార్మికులు కనీస స్థాయిలో జీవించేందుకు గ్యారంటీ వేతనం పొందే హక్కు కలిగి ఉండాలని,ఆ వేతనాన్ని జీవిత ఖర్చులు,ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సమయానుకూలంగా సవరించాల్సిన అవసరముందని పేర్కొంది. కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు సామాజిక, ఆరోగ్య సంబంధిత రక్షణ కల్పించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి చర్యలు చేపట్టాలని సూచించింది. మహిళా కార్మికులు వివక్షతో పాటు అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో,రెగ్యులర్ ఉద్యోగులకు లభించే ప్రసూతి సెలవులు వారికి కూడా ఇవ్వాలనీ,పని ప్రదేశాల్లో రక్షణ చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని తెలియజేసింది.
వివరాలు
నివేదికలోని ప్రధాన విషయాలు:
ఈ అంశాలపై "విజన్-2047" పేరుతో గిగ్, ప్లాట్ఫార్మ్ కార్మికులపై రూపొందించిన అధ్యయన నివేదికను సంస్థ విడుదల చేసింది. 2030 నాటికి గిగ్ రంగంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని, 2047 నాటికి ఈ రంగంలో పనిచేసే కార్మికుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో ఉంటుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా గిగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులలో దాదాపు 82.5 శాతం మంది అసంఘటిత రంగానికి చెందినవారు. రవాణా, ఫుడ్ డెలివరీ వంటి రంగాలతో మొదలైన గిగ్ రంగం ఇప్పుడు ఆరోగ్య సేవలు, విద్య వంటి విస్తృత రంగాల వరకు విస్తరించింది. పలుచోట్ల మహిళలను గిగ్ రంగంలోకి ఆకర్షించేందుకు ప్రోత్సహిస్తున్నారు, కానీ వారికీ పురుషులకీ వేతనాల్లో స్పష్టమైన తేడా ఉంది.
వివరాలు
నివేదికలోని ప్రధాన విషయాలు:
సంప్రదాయ ఉద్యోగాలతో పోల్చితే గిగ్ రంగంలో మహిళలు, యువతకు ఉపాధిపై బలమైన ప్రోత్సాహకాలు లేకపోవడం స్పష్టమవుతోంది. ఉద్యోగ భద్రత లేకపోవడం, స్థిరమైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, డిమాండ్ ఆధారిత పని ఒత్తిడి, కార్మిక హక్కుల లోపం,సామాజిక భద్రత లేకపోవడం లాంటి సమస్యలు గిగ్ కార్మికుల జీవితాల్లో ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఆరోగ్య బీమా, పదవీ విరమణ భద్రతలేదనే కారణంగా ఆర్థిక భద్రత కలగడం లేదు. ప్రాథమిక విద్య పూర్తి చేసినవారు నుంచి ఉన్నత విద్యావంతుల వరకు చాలామంది గిగ్ ఉద్యోగాలను స్వీకరిస్తున్నారు. 18-45 ఏళ్ల వయస్సున్నవారే ఈ రంగంలో అధికంగా చేరుతున్నారు. ప్రస్తుతం గిగ్ ఉద్యోగాలు ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే విస్తరించి ఉన్నాయి. గిగ్ వర్కర్లందరికీ సమానమైన పని గంటలు నిర్దేశించాలి.
వివరాలు
నివేదికలో పొందుపరిచిన సిఫార్సులు:
ప్రస్తుత పరిస్థితిలో 60శాతం మంది కార్మికులు వారానికి ఏడు రోజుల పాటు రోజుకు 12గంటలకు మించిన శ్రమతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరికి అనుకూలమైన సామాజిక భద్రత పథకాలు చేరువ చేయాలి. ఉపాధి కల్పిస్తున్న ప్లాట్ఫార్మ్ కంపెనీలు కార్మికులతో పాటు నియంత్రణ సంస్థలకు కూడా అవసరమైన ప్రోత్సాహాలను ఇవ్వాలి. కార్మికులు ఆర్థిక నియమాలు పాటించేలా అవగాహన కల్పించాలి,దీర్ఘకాలిక లక్ష్యాలతో పొదుపును ప్రోత్సహించాలి. గిగ్ వర్కర్లు చేసిన ప్రతి లావాదేవీ,చెల్లింపుల వివరాలను తాము తెలుసుకునే విధంగా డేటా అందుబాటులో ఉండాలి. కార్మికుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రమాద బీమా,ఆరోగ్య బీమా పథకాలను అమలు చేయడంతో పాటు మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యుల సలహాలు,కౌన్సెలింగ్ సేవలను కల్పించాలి.