Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు-2027 తేదీలు ఖరారు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయని స్పష్టం చేసింది. పుష్కరాల తేదీల నిర్ణయంలో తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అందించిన జ్యోతిష్యాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పుష్కరాల నిర్వహణపై దేవాదాయ శాఖ కమిషనర్ సమర్పించిన నివేదికకు ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది.
Details
అధికారిక ఉత్తర్వులు జారీ
దీనికి అనుగుణంగా దేవాదాయ శాఖ ఎక్స్ఆఫిషియో సెక్రటరీ డా. ఎం. హరి జవహర్లాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గోదావరి పుష్కరాల తేదీల ఖరారుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తంగా 2027లో నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాలు జూన్ 26న ప్రారంభమై 12రోజుల పాటు కొనసాగి జూలై 7న ముగుస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అందించిన పండితాభిప్రాయాన్ని ఆధారంగా చేసుకుని ఈ తేదీలను ఖరారు చేసినట్లు వెల్లడించింది. టీటీడీ సిద్ధాంతి సూచనలను దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించగా, వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది.
Details
ఏర్పాట్లపై త్వరలోనే కార్యాచరణ ప్రారంభం
పుష్కరాలకు ఇంకా సుమారు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ, ఏర్పాట్లను ముందుగానే ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తుగా తేదీలను ప్రకటించడం గమనార్హంగా మారింది. ఈ ప్రకటనతో తూర్పుగోదావరి జిల్లా సహా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై త్వరలోనే కార్యాచరణ ప్రారంభం కానుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల వసతి, పారిశుధ్యం తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు ఈ ముందస్తు ప్రకటన అధికార యంత్రాంగానికి స్పష్టతనిచ్చిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.