
AP DSC: ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. నిబంధనల్లో సడలింపులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇటీవల విడుదలైన డిఎస్సీ నోటిఫికేషన్లో అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారిన పలు నిబంధనలను సవరించే నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మంత్రి నారా లోకేష్ "ఎక్స్" ద్వారా ప్రకటన విడుదల చేశారు. డిఎస్సీ దరఖాస్తు సమయంలోనే అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలన్న నిబంధన అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.
ముఖ్యంగా కుల ధృవీకరణ, నివాస ధృవీకరణ వంటి పత్రాల కోసం ప్రిపరేషన్ సమయానికే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లడంతో, దరఖాస్తు సమయంలో సర్టిఫికెట్ల అప్లోడ్ను ఆప్షనల్గా చేస్తూ మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Details
అర్హత కోల్పోయిన లక్షలాది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే అవకాశం
ఇకపై అసలు ధ్రువీకరణ పత్రాలను సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పిస్తే చాలని స్పష్టంగా చెప్పారు.
ఇక అర్హత మార్కుల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మొదట విడుదలైన నోటిఫికేషన్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 45-50 శాతం మార్కులు తప్పనిసరి అని పేర్కొనగా, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు 40 శాతం మార్కులే సరిపోతాయని మార్పు చేశారు.
ఈ నిర్ణయంతో గతంలో అర్హత కోల్పోయిన లక్షలాది అభ్యర్థులకు డిఎస్సీకి దరఖాస్తు చేసే అవకాశం లభించింది.
Details
ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్ పోస్టుల విషయంలో అనేక సందేహాలు
అయితే డిఎస్సీ నోటిఫికేషన్లోని కొన్ని అర్హత నిబంధనలు అభ్యర్థుల్లో మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి.
ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్ పోస్టుల విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి.
బిసిఏ (BCA) అభ్యర్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవకపోయినా అవకాశం ఇవ్వడం, అయితే బిఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులను అనుమతించకపోవడం అభ్యర్థుల అసంతృప్తికి కారణమైంది.
బిఎస్సీ కంప్యూటర్స్లో కెమిస్ట్రీ స్థానంలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉండేందున, వారిని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.