LOADING...
Rythu Bharosa Funds : రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా రెండో విడత తేదీ ఖరారు
రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా రెండో విడత తేదీ ఖరారు

Rythu Bharosa Funds : రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా రెండో విడత తేదీ ఖరారు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2026
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

రైతులకు పంట సాగు సమయంలో ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీ ఏటా ఎకరాకు రూ.12 వేల చొప్పున రెండు విడతల్లో సాయం అందిస్తోంది. ప్రస్తుతం రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి ఈ నిధులను మూడు విడతల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తొలి విడత నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. గత నెల 23న మొదటి విడతగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 68,89,955 మంది రైతులకు ఒక ఎకరం లోపు భూమికి సంబంధించిన సొమ్మును జమ చేసింది. 57,44,907.19 ఎకరాలకు గాను రూ.3,446.94 కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసింది.

వివరాలుు

మూడు విడతల్లో రిలీజ్

ఇప్పుడంతా రైతులు రెండో విడత కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి పంటలు కోత దశకు చేరుకుంటుండటంతో, వీలైనంత త్వరగా ఈనెలలోనే రెండో విడత నిధులను జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను మూడు విడతల్లో విడుదల చేయనున్నారు. తొలి విడత పూర్తయిన నేపథ్యంలో, ఈ నెల 22లోపు రెండో విడత, నెలాఖరు లోపు మూడో విడత నిధులను జమ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకాన్ని ఒక సీజన్‌లో అమలు చేయడానికి సుమారు రూ.9 వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.

వివరాలు

ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సొమ్ము జమ చేసే అవకాశం

రెండో విడత కోసం ఈ నెల 7న ప్రభుత్వం ఒకేసారి రూ.3,900 కోట్లు రుణంగా సమీకరించింది. అలాగే ఈ నెల 21న మరో రూ.3 వేల కోట్లు అప్పుగా సమీకరించనుంది. దీంతో మొత్తం రూ.6,900 కోట్లు ఖజానాలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ నిధుల్లో నుంచి రెండో విడత రైతు భరోసా చెల్లింపులకు కొంత మొత్తాన్ని కేటాయించే అవకాశాలున్నాయి. రెండో విడతలో ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సొమ్ము జమ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల కోట్ల వరకు అవసరం అవుతుందని అంచనా. మూడో విడత నిధులను కూడా ఈ నెలాఖరులోపు రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement