Page Loader
Telangana: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏడు పట్టణాల్లో స్వశక్తి భవనాలు
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏడు పట్టణాల్లో స్వశక్తి భవనాలు

Telangana: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏడు పట్టణాల్లో స్వశక్తి భవనాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2024
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

సంగారెడ్డి జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలకు సొంత భవనాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సంఘాల సభ్యులు, గ్రామ్య సంఘాలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించేవారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహించబడుతున్నాయి. స్వశక్తి సంఘాలు ఏర్పడినప్పటి నుంచి సొంత భవనాలు లేవు. ప్రతినెలా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడానికి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. స్వశక్తి భవనాలు అందుబాటులో లేక, వారు చెట్ల కింద, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు వంటి ప్రాంతాలలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పురపాలక కార్యాలయాల్లో ఓ గదిని కేటాయించినప్పటికీ, అది వారి అవసరాలకు సరిపోవడం లేదు.

వివరాలు 

అన్ని పట్టణాల్లో స్వశక్తి భవనాలకు స్థలాలు కేటాయించాలని నిర్ణయం 

జిల్లాలోని అన్ని పట్టణాల్లో సమావేశాలు,ఇతర కార్యక్రమాల కోసం స్వశక్తి భవనాలు నిర్మించాలనే కోరుతూ, మహిళా సభ్యులు, ప్రజాప్రతినిధులు ఏళ్లుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అన్ని పట్టణాల్లో స్వశక్తి భవనాలకు స్థలాలు కేటాయించాలని నిర్ణయించింది. పురపాలికల్లో అవసరమైన స్థలాలను సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. స్థల సేకరణ పూర్తైన తర్వాత, భవన నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తారు.

వివరాలు 

500 గజాల స్థలం అవసరం 

స్వశక్తి భవనాలు సంగారెడ్డి మినహా ఏడు పురపాలక సంఘాలకు మంజూరు అయ్యాయి. సంగారెడ్డికి 12 సంవత్సరాల క్రితమే మంజూరు చేసినప్పటికీ, ఇప్పటివరకు నిర్మాణం పూర్తికాలేదు. మిగతా పురపాలికల్లో కమిషనర్లు, రెవెన్యూ అధికారులతో కలిసి 500 గజాల స్థలం సేకరించాల్సి ఉంటుంది. రెండు నెలల్లో స్థల సేకరణ పూర్తయితే, భవన నిర్మాణానికి ఇంజినీర్లతో ప్రతిపాదనలు తయారు చేయించాలి. మెప్మా ఉన్నతాధికారులకు నివేదికలు పంపితే, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారు. మహిళా సంఘాల భవనాల కోసం స్థల సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు డీఎంసీ మల్లీశ్వరి తెలిపారు.