Telangana: ఎకరానికి 25 క్వింటాళ్ల మక్కల కొనుగోలు.. మార్క్ఫెడ్కు ప్రభుత్వం అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మక్క కొనుగోళ్లకు సంబంధించిన మద్దతు ధర విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో ఎకరానికి 18 క్వింటాళ్ల వరకే కొనుగోలు పరిమితి ఉండగా,రైతుల అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం ఈ పరిమితిని పెంచుతూ మంగళవారం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 125 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 23,131 టన్నుల మొక్కజొన్న కొనుగోలు పూర్తయింది. కొన్ని జిల్లాల్లో రైతులు పరిమితికి మించి మక్కను తీసుకురాగా, అధికారులు కొనుగోలు నిరాకరించడంతో రైతులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
వివరాలు
మక్క కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,400 కోట్లు ఖర్చు
వారి విజ్ఞప్తి మేరకు కొనుగోలు పరిమితి పెంచాల్సిన అవసరం ఉన్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం మక్కను కొనుగోలు చేయకపోవడంతో, మొత్తం కొనుగోలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా భరించాల్సి వచ్చింది. ఇప్పటివరకు మక్క కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,400 కోట్లు ఖర్చు చేసింది. తాజాగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎకరానికి 25 క్వింటాళ్ల వరకూ మక్క కొనుగోలు పరిమితిని పెంచేందుకు అనుమతి ఇచ్చారు. దీనికి అనుగుణంగా కొత్త ప్రభుత్వ ఆదేశాలు విడుదలయ్యాయి.