Page Loader
Grama Sabalu: తెలంగాణలో గ్రామసభలు.. కొత్తగా 47,413 దరఖాస్తులు 
తెలంగాణలో గ్రామసభలు.. కొత్తగా 47,413 దరఖాస్తులు

Grama Sabalu: తెలంగాణలో గ్రామసభలు.. కొత్తగా 47,413 దరఖాస్తులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 22, 2025
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో మొదటి రోజు (మంగళవారం) 47,413 కొత్త దరఖాస్తులు అందాయి. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల కోసం ఈ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలు జనవరి 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గ్రామసభల్లో ప్రజలు తమ సమస్యలను అధికారుల వద్ద పెట్టారు. పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంపై ప్రజలు అధికారులను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా, మంగళవారం 3,410 పంచాయతీల పరిధిలో ఈ సభలు నిర్వహించారు. లిస్టులో పేర్లు లేకపోయిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

Details

రేషన్ కార్డులు అందలేదని వాపోతున్న లబ్ధిదారులు

మొత్తం 47,413 కొత్త దరఖాస్తులు అందగా, కొన్ని ప్రాంతాల్లో రేషన్ కార్డుల జారీపై ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దరఖాస్తులు తీసుకుంటున్నా రేషన్ కార్డులు అందించడం లేదని, గతంలో దరఖాస్తు చేసినా ఫలితం లేకుండా పోయిందని వారు తెలిపారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అనర్హులతో లబ్ధిదారుల జాబితాను రూపొందించారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై గ్రామసభల్లో అధికారులు స్పందించి, పథకాలకు అర్హుల లిస్టును ప్రజలకు చదివి వినిపించారు. సభల్లో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.