
MLC Kavitha: గ్రూప్-1 అభ్యర్థుల అనుమానాలకు సమాధానం చెప్పాలి
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.
పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు తన దృష్టికి తెచ్చారని ఆమె తెలిపారు.
ట్రాన్స్లేషన్ సమస్య కారణంగా ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు సరిగా మూల్యాంకనం చేయలేకపోయారని, దీనివల్ల మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కవిత వెల్లడించారు.
Details
హాల్ టికెట్ నంబర్ల మార్పుతో అనుమానాలు
అదేవిధంగా, గ్రూప్-1 పరీక్షల్లో ప్రిలిమ్స్కి ఒక హాల్టికెట్ నంబర్, మెయిన్స్కి మరో హాల్టికెట్ నంబర్ కేటాయించడం అభ్యర్థుల్లో అనుమానాలకు దారితీసిందని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల TSPSC విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో దాదాపు 13,000 మంది అభ్యర్థుల ఫలితాలను ప్రకటించలేదని, ఏ కారణంతో వారిని ఇన్వాలీడ్గా ప్రకటించారో వెల్లడించాల్సిన అవసరం ఉందని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారని కవిత తెలిపారు.
గ్రూప్ పరీక్షల్లో అవకతవకలపై ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిసి చర్చించారు.
తమ అనుమానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని అభ్యర్థులు ఆమెను కోరారు.