Heat Wave: మండుతున్న ఎండలు.. నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాలులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతున్నాయి. సోమవారం రాష్ట్రంలోని 51 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, మరో 49 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు ఎక్కువగా ప్రభావం చూపనున్నాయని, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వివరాలు
పొట్టిపాడులో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత
ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1, నంద్యాల గ్రామీణ ప్రాంతంలో 42.9, అనంతపురం జిల్లా తెరన్నపల్లెలో 42.3, కర్నూలు జిల్లా గూడూరులో 42.1 డిగ్రీలు నమోదయ్యాయి. ఇదే విధంగా పల్నాడు జిల్లా దుర్గిలో 41.8, శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో 41.6, మార్కాపురం జిల్లా అనుమలపల్లి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కమ్మిపాడులో 41.2, పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.