Orange Alert: తెలంగాణాలో దంచికొడుతున్న ఎండలు.. ఆ రెండు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణవ్యాప్తంగా ఎండలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు కిరణాలు మండిపడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికే వెనకాడుతున్నారు. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం ప్రస్తుతం ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతలకు మరో 3 డిగ్రీల వరకు పెరుగుదల ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో వేడి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
వివరాలు
ఉమ్మడి ఖమ్మం,మహబూబ్నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాల్లో ఎండలు ప్రమాదకర స్థాయికి చేరే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. అందుకే ఈ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేశారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముంది. ఇతర జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల వాటికి 'ఎల్లో అలర్ట్' అమల్లో ఉంచారు. మధ్యాహ్నం సమయంలో వేడి గాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అవసరం లేకపోతే బయటకు వెళ్లకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.