
Jurala : జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 12 గేట్లు ఎత్తిన అధికారులు!
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని శనివారం రాత్రి అధికారులు అప్రమత్తమై, ప్రాజెక్టులోని 12గేట్లు ఎత్తి, భారీగా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,30,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో1,44,076 క్యూసెక్కులున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.518మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.200 మీటర్ల వద్ద కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి ప్రవాహం మరింతగా పెరిగింది. ఇక ఇటీవల జూరాల ప్రాజెక్టులో 9వ గేటు రోప్ తెగిపోవడం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగించింది.
Details
ఆయకట్టులో రైతుల్లో భయాందోళనలు
అంతేగాక, మరో రెండు గేట్ల రోప్లు బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అయకట్టు రైతుల్లో భయభ్రాంతులు నెలకొన్నాయి. అయితే అధికారులు స్పందిస్తూ ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. ముంపు ప్రాంతాల్లో అపాయ నివారణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. తెగిపోయిన రోప్తో పాటు మిగతా బలహీనమైన రోప్లను కూడా వెంటనే మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో మొత్తం 67 రేడియల్ గేట్లు ఉండగా, వాటిలో 8 గేట్ల రోప్లు తుప్పు పట్టినవిగా గుర్తించారు. ఇప్పటివరకు నాలుగు రోప్లు మార్చగా, మిగతా నాలుగింటిలో ఒకటి మారకముందే తెగిపోవడం జరిగింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.