LOADING...
Strait of Hormuz Closure: హోర్ముజ్ జలసంధి మూసివేత ఎఫెక్ట్.. భారత్‌లో ఈ 7 వస్తువుల ధరలు పెరగొచ్చు!
హోర్ముజ్ జలసంధి మూసివేత ఎఫెక్ట్.. భారత్‌లో ఈ 7 వస్తువుల ధరలు పెరగొచ్చు!

Strait of Hormuz Closure: హోర్ముజ్ జలసంధి మూసివేత ఎఫెక్ట్.. భారత్‌లో ఈ 7 వస్తువుల ధరలు పెరగొచ్చు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ,ఇరాన్‌ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కీలక సముద్ర మార్గం గుండా ప్రయాణించే నౌకలపై దాడులు చేస్తామని హెచ్చరించినట్లు ఇరాన్‌ ప్రభుత్వ,సెమీ అధికారిక మీడియా వెల్లడించాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో భారత్‌ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలపై ప్రత్యక్ష ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు,ద్రవీభవించిన సహజ వాయువు (LNG)లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది.

వివరాలు 

88 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి

ఈ రవాణాకు అంతరాయం ఏర్పడితే ఇంధన ధరలు భారీగా పెరిగి, దాని ప్రభావం అన్ని రంగాలపై పడే అవకాశం ఉంది. భారత్‌కు ఈ పరిస్థితి మరింత కీలకంగా మారింది. దేశ అవసరాలకు దాదాపు 88 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందులో ఎక్కువ భాగం గల్ఫ్‌ దేశాల నుంచే వస్తుంది. అలాగే దేశంలో వినియోగించే ఎల్పీజీ గ్యాస్‌లో గణనీయమైన వాటా కూడా హోర్ముజ్ జలసంధి ద్వారానే భారత్‌కు చేరుతుంది. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎక్కువకాలం అధికంగానే కొనసాగితే సామాన్యులపై భారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఏడు వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

1. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు:

వంటగ్యాస్‌ ధరలపై మొదట ప్రభావం కనిపించే అవకాశం ఉంది. దిగుమతుల ఖర్చు పెరగడంతో దేశీయ ధరలు, ప్రభుత్వ సబ్సిడీలపై ప్రభావం పడొచ్చు. 2. పెట్రోల్‌, డీజిల్: ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన శుద్ధి, దిగుమతి ఖర్చులు అధికమవుతాయి. వెంటనే ధరలు పెరగకపోయినా, పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. 3. కూరగాయలు, పాలు, నిత్యావసర సరుకులు: వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు దూర ప్రాంతాల నుంచి రవాణా అవుతాయి. డీజిల్‌ ఖర్చులు పెరిగితే రవాణా వ్యయం అధికమై, చివరకు వినియోగదారులపై భారం పడుతుంది.

Advertisement

వివరాలు 

4. ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలు:

బిస్కెట్లు, చిప్స్‌, వంట నూనెలు, ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ వంటి ఉత్పత్తుల తయారీ, రవాణా ఖర్చులు పెరగడంతో వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్రోలియం ఆధారిత ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ ఖరీదవుతుంది. 5. సబ్బులు, డిటర్జెంట్లు: చాలా గృహోపయోగ శుభ్రత ఉత్పత్తుల్లో పెట్రోకెమికల్‌ పదార్థాలు ఉపయోగిస్తారు. ముడి చమురు ధరలు పెరిగితే తయారీ వ్యయం కూడా పెరిగి, మార్కెట్లో ధరలు పెరగొచ్చు. 6. ప్లాస్టిక్‌ గృహోపకరణాలు: బకెట్లు, నీటి బాటిళ్లు, కంటైనర్లు, స్టోరేజ్‌ బాక్స్‌లు, వంటగది ప్లాస్టిక్‌ వస్తువుల తయారీలో పెట్రోలియం ఉత్పత్తులు కీలకం. దీంతో వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

7. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు:

ఈ ప్రభావం వెంటనే కనిపించకపోయినా,రవాణా ఖర్చులు,ముడి పదార్థాల ధరలు పెరగడంతో మొబైల్‌ ఫోన్లు,గృహోపకరణాలు,ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు ఖరీదయ్యే అవకాశం ఉంది. భారత్‌కు ఎందుకు ఆందోళన? భారత్‌ గత కొన్నేళ్లుగా ఇంధన దిగుమతుల వనరులను విస్తరించింది.వ్యూహాత్మక చమురు నిల్వలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే రష్యా,ఆఫ్రికా,లాటిన్‌ అమెరికా వంటి ప్రాంతాల నుంచి అదనపు ముడి చమురును కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అధికంగానే ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువులు, గృహోపకరణాల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై అదనపు భారం పడొచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement