
Air Force Rankings: వైమానిక దళ ర్యాంకింగ్స్లో భారతదేశం చైనాను ఎలా అధిగమించింది
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అన్ని దేశాలకు శక్తివంతమైన వాయుసేన అవసరమనే విషయం భారతదేశం చేసిన "ఆపరేషన్ సిందూర్" సమయంలో స్పష్టమైంది. యుద్ధంలో ఎవరు ఆధిపత్యం సాధిస్తారో అనేది వాయుసేన ఆధునికతపై ఆధారపడి ఉంటుందని ఆ ఆపరేషన్ చూపించింది. ఇప్పుడు తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ చైనాను అధిగమించిందని తెలుస్తోంది. "వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మాడర్న్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ (WDMMA)" విడుదల చేసిన తాజా జాబితాలో అమెరికా మొదటి స్థానంలో, రష్యా రెండవ స్థానంలో ఉండగా, భారత్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. చైనా నాలుగో స్థానంలో ఉంది. భారత్ ర్యాంకింగ్ పెరగడం ఆసియా వ్యూహాత్మక సమతుల్యంలో ఒక పెద్ద మార్పుకు సంకేతమని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు
వివరాలు
టీవీఆర్ ర్యాంకింగ్స్ ప్రకారం
WDMMA ప్రకారం అమెరికాకు అత్యంత బలమైన వాయుసేన ఉంది. దాని "ట్రూవాల్ రేటింగ్ (TVR)" 242.9 గా నమోదైంది. ఈ స్కోరు కేవలం విమానాల సంఖ్య ఆధారంగా కాకుండా, దాడి-రక్షణ సామర్థ్యం, లోజిస్టిక్ సపోర్ట్, ఆధునీకరణ స్థాయి, ఆపరేషనల్ ట్రైనింగ్ వంటి అంశాల ఆధారంగా లెక్కించబడుతుంది. రష్యా 114.2 టీవీఆర్తో రెండో స్థానంలో ఉంది. భారత్ 69.4 స్కోరుతో మూడో స్థానంలో ఉండగా, చైనా 63.8 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచింది. జపాన్ (58.1), ఇజ్రాయెల్ (56.3), ఫ్రాన్స్ (55.3) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
వివరాలు
భారత్ vs చైనా వాయు శక్తి
WDMMA విశ్లేషణ ప్రకారం భారత్ చైనాపై స్వల్ప ఆధిక్యం సాధించింది. భారత్ టీవీఆర్ 69.4 కాగా, చైనాకు 63.8. భారత వాయుసేనకు మొత్తం 1,716విమానాలు ఉండగా,చైనాకు సుమారు 3,733 ఉన్నాయి. కానీ భారత దళం సమతుల్యంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 31.6 శాతం ఫైటర్ జెట్స్, 29 శాతం హెలికాప్టర్లు, 21.8శాతం ట్రైనర్లు. చైనా వాయుసేనలో మాత్రం 52.9శాతం ఫైటర్లు,28.4శాతం ట్రైనర్లు ఉన్నాయి. భారత వాయుసేన ప్రస్తుతం ఫ్రాన్స్లో తయారైన రాఫెల్, మిరేజ్-2000, రష్యన్ సుఖోయ్-30, మిగ్-29, దేశీయంగా తయారైన తేజస్ వంటి విమానాలను నడుపుతోంది. ఇటీవలే ఆరు దశాబ్దాలపాటు సేవలందించిన మిగ్-21ల విమానాలకు వీడ్కోలు పలికారు. 1960లలో సేవలోకి వచ్చిన మిగ్-21లు భారత్-పాకిస్తాన్, భారత్-చైనా యుద్ధాల్లో,బాలాకోట్ వైమానిక దాడిలో కీలకపాత్ర పోషించాయి.
వివరాలు
భారత్ vs చైనా వాయు శక్తి
భారత ప్రభుత్వం రాబోయే రెండు దశాబ్దాల్లో 600కి పైగా కొత్త ఫైటర్ జెట్లు ప్రవేశపెట్టే ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో ఎల్సీఏ-ఎంకె1ఏ, ఎంకె2, ఎంఆర్ఎఫ్ఏ, ఏఎంసీఏ వంటి మోడళ్లను చేర్చనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఏఎంసీఏ అభివృద్ధి జరుగుతున్న సమయంలో తాత్కాలికంగా ఐదవ తరం ఫైటర్ జెట్లు దిగుమతి చేసుకునే అవకాశముందని తెలిపారు. దీనికి రష్యా SU-57, అమెరికా F-35 మోడళ్లను పరిశీలిస్తున్నారు.
వివరాలు
చైనా వాయుసేన స్థితి
చైనాకు ఉన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ఫోర్స్ (PLAAF) భారీ సంఖ్యలో జెట్లు కలిగి ఉంది. వీటిలో ఐదవ తరం J-20, J-35 స్టెల్త్ జెట్స్, అలాగే ఇటీవల ప్రకటించిన ప్రపంచపు మొదటి ఆరో తరం J-36 జెట్ ఉన్నాయి. కానీ "ఆపరేషన్ సిందూర్"లో భారత వాయుసేన పాకిస్తాన్ కంటే మెరుగ్గా రాణించింది. చైనా తయారీ ఆయుధాలపై ఆధారపడిన పాక్ రక్షణ వ్యవస్థలను భారత క్షిపణులు సులభంగా దాటాయి. పాక్ చైనా తయారీ J-10C ఫైటర్ జెట్స్, PL-15E క్షిపణులు, HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగించినా, వాటి ప్రభావం తక్కువగానే ఉంది. భారత వైమానిక దళం చేసిన దాడులు పాక్కు భారీ నష్టం కలిగించాయి.
వివరాలు
ఎందుకు ఈ ర్యాంకింగ్స్ కీలకం?
DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం, పాక్ 100 మందికి పైగా సైనికులను, కనీసం 12 విమానాలను కోల్పోయింది. ప్రపంచ వ్యూహాత్మక యుద్ధాలలో వైమానిక శక్తి అత్యంత నిర్ణయాత్మక అంశంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు, భారత్-పాక్ సంఘర్షణలు ఈ విషయం స్పష్టంగా చూపిస్తున్నాయి. రష్యా మూడు సంవత్సరాల యుద్ధంలో కూడా ఉక్రెయిన్పై ఆధిపత్యం సాధించలేకపోయింది. కానీ ఇజ్రాయెల్ కేవలం నాలుగు రోజుల్లో ఇరాన్పై ఆధిపత్యం సాధించింది. ఈ ర్యాంకింగ్స్ గ్లోబల్ ఫైర్పవర్ ర్యాంకింగ్స్ కంటే వేరు. దక్షిణ ఆసియాలో శక్తిసమీకరణంలో భారత్ ప్రాధాన్యం పెరుగుతోందని, రాబోయే రక్షణ వ్యూహాలకు ఈ ర్యాంకులు దిశానిర్దేశం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.