Kedarnath: కేదార్నాథ్ ఆలయం యాత్రకు భారీ డిమాండ్..గంటన్నరలోనే 31 వేల టికెట్లు బుకింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉన్న పవిత్ర క్షేత్రం కేదార్నాథ్ ఆలయంకు వెళ్లే భక్తుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ షటిల్ సేవలకు భారీగా స్పందన లభిస్తోంది. ఈ నెల 22 నుంచి జూన్ 15 వరకు హెలికాప్టర్ ద్వారా కేదార్నాథ్ చేరుకునేందుకు అందుబాటులో ఉంచిన మొత్తం 31,450 టికెట్లు కేవలం గంటన్నరలోనే ఆన్లైన్లో పూర్తిగా బుక్ కావడం విశేషం. మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి అత్యధికంగా బుకింగులు నమోదయ్యాయి. సాధారణంగా బేస్ క్యాంపుల నుంచి కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు 16 కిలోమీటర్ల కఠినమైన ట్రెక్కింగ్ మార్గం ఉంది.
వివరాలు
భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు
ఈ ప్రయాణం చేయలేని భక్తుల కోసం ప్రభుత్వం హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు గుప్తకాశీ, ఫాటా, సిర్సీ ప్రాంతాల నుంచి నిర్వహించబడుతున్నాయి. టికెట్ ధరలు కూడా బేస్ పాయింట్ను బట్టి మారుతున్నాయి. కనీసం రూ.7,000 నుంచి గరిష్ఠంగా రూ.13,000 వరకు చార్జీలు నిర్ణయించారు. ఇక ఈ నెల 22న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి కేవలం నాలుగు రోజుల్లోనే 1,24,782 మంది భక్తులు దర్శనం చేసుకోవడం గమనార్హం.