LOADING...
TMC: టీఎంసీకి భారీ షాక్.. రూ.440 కోట్ల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్!
టీఎంసీకి భారీ షాక్.. రూ.440 కోట్ల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్!

TMC: టీఎంసీకి భారీ షాక్.. రూ.440 కోట్ల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2026
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో అధికార ప్రతిపక్ష పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత విభేదాలు మరింత ముదిరాయి. పార్టీకి చెందిన సుమారు రూ.440 కోట్లు ఉన్న మూడు బ్యాంకు ఖాతాల డెబిట్ లావాదేవీలను అధికారులు నిలిపివేశారు. ఈ నిధుల మూలాలపై దర్యాప్తు జరపాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఓ ప్రైవేట్ బ్యాంకులో నిర్వహిస్తున్న ఈ మూడు ఖాతాలపై "డెబిట్ ఫ్రీజ్" విధించినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. దీంతో ఖాతాల నుంచి డబ్బులు ఉపసంహరించుకోవడం లేదా ఇతర ఖాతాలకు బదిలీ చేయడం సాధ్యం కాదు. అయితే కొత్తగా నిధులు జమ కావడానికి మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు.

వివరాలు

ఆ ఖాతాలపై ఎఫ్ఐఆర్ నమోదు

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత పార్టీ ఆర్థిక, సంస్థాగత వ్యవహారాలపై మాజీ మంత్రి ఆరోప్ బిశ్వాస్ వర్గం, ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. రితబ్రత బెనర్జీ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బిధాన్‌నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని వారు కోరారు. ఆ డబ్బు చట్టబద్ధమైన మార్గాల్లో వచ్చిందా? లేక అక్రమ వసూళ్లు, ప్రభుత్వ నిధుల మళ్లింపు, కుంభకోణాల ద్వారా సమకూరిందా? అనే అంశాలను విచారించాలని కోరారు.

వివరాలు

మూడు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి

"అక్రమ కార్యకలాపాలు, అధికార దుర్వినియోగం, అనైతిక ఆర్థిక లావాదేవీలు, చట్టవిరుద్ధంగా సేకరించిన నిధులు ఈ ఖాతాల్లో జమ అయ్యి ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మమతా బెనర్జీకి విధేయుడైన ఓ సీనియర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మూడు ఖాతాలు ఫ్రీజ్ అయిన విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. "ఖాతాలు ఫ్రీజ్ చేసినట్లు విన్నాం. పూర్తి వివరాలు సాయంత్రానికి తెలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఆరోప్ బిశ్వాస్ కూడా బ్యాంకుకు లేఖ రాసి పార్టీ ఖాతాలను రక్షించాలని, అంతర్గత నాయకత్వ వివాదం పరిష్కారం అయ్యే వరకు రూ.500 కోట్లకు పైగా ఉన్న పార్టీ డిపాజిట్లపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా నిలిపివేయాలని కోరారు.

Advertisement

వివరాలు

ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కీలక వ్యాఖ్యలు

అయితే ఆరోప్ బిశ్వాస్ ఖాతాల నిర్వహణ, నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫ్రీజ్ కోరగా.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మాత్రం నిధుల మూలాలపై క్రిమినల్ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఈ ఫిర్యాదులు నమోదు చేసిన అదే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న వివాదానికి సంబంధించి ఆరోప్ బిశ్వాస్‌పై నమోదైన కేసును కూడా విచారిస్తోంది. ఇదిలా ఉండగా, మమతా బెనర్జీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

వివరాలు

ఆర్థిక వ్యవహారాలపై మాట్లాడే అధికారం ఆయనకు లేదు

ఆరోప్ బిశ్వాస్ ప్రస్తుతం పార్టీ ఖజాంచీ కాదని, పార్టీ ఆర్థిక వ్యవహారాలపై మాట్లాడే అధికారం ఆయనకు లేదని స్పష్టం చేశారు. జూన్ 5న జరిగిన కార్యవర్గ సమావేశంలో సుభాశిష్ చక్రవర్తిని ఏకగ్రీవంగా పార్టీ ఖజాంచీగా నియమించినట్లు, అప్పటి నుంచి ఆయనే ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు కునాల్ ఘోష్ వెల్లడించారు. మూడు ఖాతాలపై డెబిట్ ఫ్రీజ్ అమల్లోకి రావడంతో టీఎంసీ అంతర్గత ఆర్థిక వివాదం ఇప్పుడు పోలీసు ఫిర్యాదులు, నిధుల మూలాలపై అనుమానాలు, పార్టీ ఆర్థిక వ్యవహారాలపై అధికారం ఎవరికనే ప్రశ్నల వరకు విస్తరించింది.

Advertisement