
Hyderabad : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను బంద్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ వాసులకోసం పెద్ద హెచ్చరిక. నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరమ్మతులు జరుగుతున్నందున వచ్చే 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి వర్గాలు పేర్కొన్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు. నగరానికి తాగునీటిని అందించే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్ట్ (KDWP) ఫేజ్-3లో, కోదండాపూర్ నుంచి గొడకొండ్ల వరకు పంపింగ్ మెయిన్-1 పై 2,375 మిల్లీమీటర్లు వ్యాసం గల పైపులో భారీ లీకేజీ ఏర్పడింది. ఈ కారణంగా ఎయిర్ వాల్వ్, గేట్ వాల్వ్ వంటి ముఖ్యమైన వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగాల మార్పులు, మరమ్మతులు చేపట్టనున్నారు.
వివరాలు
నీటి సరఫరా నిలిచే ప్రాంతాలు:
ఈ మార్పుల కారణంగా, నగరంలోని పలు రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో సోమవారం (13) ఉదయం 6 గంటల నుంచి మంగళవారం (14) సాయంత్రం 6 గంటల వరకు, అంటే సుమారు 36 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని జలమండలి వర్గాలు తెలిపారు. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, ప్రసాదన్ నగర్, ఫిలింనగర్, జూబ్లీ హిల్స్, తట్టిఖానా, భోజగుట్ట, షేక్పేట్, హకీంపేట్, కార్వాన్, మెహిదీపట్నం, ఆసిఫ్నగర్, గోల్కొండ, లంగర్ హౌస్, దుర్గానగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్ పూర్, గంధంగూడ, బండ్లగూడ, శాస్త్రిపురం, అల్లబండ, మధుబన్ కాలనీలు.
వివరాలు
జలమండలి అధికారులు సూచనలు
అలాగే, ధర్మసాయి (శంషాబాద్), సాహేబ్ నగర్, ఆటోనగర్, సరూర్ నగర్, వాసవీనగర్, నాగోల్, ఎన్టీఆర్ నగర్, వనస్థలిపురం, దేవేందర్ నగర్, ఉప్పల్, స్నేహపురి కాలనీ, భారతనగర్, రాంపల్లి, బోడుప్పల్, చెంగిచర్ల, మానిక్ చంద్, మల్లికార్జున నగర్, పీర్జాదిగూడ, పెద్దఅంబర్ పేట్ వంటి ప్రాంతాల్లో కూడా నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు సూచించారు. ప్రజలు ఈ కాలంలో నీటి నిల్వలు సిద్ధం చేసుకోవడం, అవసరమైన ఏర్పాట్లు చేయడం ముఖ్యం అని జలమండలి అధికారులు సూచించారు.