Page Loader
Hyderabad: చారిత్రక హుస్సేన్‌సాగర్‌ చుట్టూ సరికొత్త అందాలు.. స్కైవాక్, సైకిల్‌ట్రాక్‌  

Hyderabad: చారిత్రక హుస్సేన్‌సాగర్‌ చుట్టూ సరికొత్త అందాలు.. స్కైవాక్, సైకిల్‌ట్రాక్‌  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌సాగర్ సరస్సు పరిసర ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన పర్యాటక స్థానాలైన నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు, లుంబినీపార్కు, ఎన్టీఆర్‌గార్డెన్, ట్యాంక్‌బండ్ ఈ ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. వారాంతాల్లో, ఇతర సెలవుల్లో వేల సంఖ్యలో సందర్శకులు ఈ ప్రదేశాలను సందర్శిస్తుంటారు. ముఖ్యంగా వారాంతాలలో సందర్శకుల సంఖ్య లక్షకు పైగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఒక ప్రణాళికను సిద్ధం చేసింది.

వివరాలు 

సాగర్ చుట్టూ స్కైవాక్‌ నిర్మించాలని ప్రణాళిక

హుస్సేన్‌సాగర్‌కు చేరుకోవడాన్ని మరింత సౌకర్యవంతం చేయడానికి మెట్రో, ఎంఎంటీఎస్‌ నుంచి సాగర్‌ చుట్టూ స్కైవాక్‌ నిర్మించాలనేది ప్రణాళిక. మెట్రో ప్రయాణికులు ఖైరతాబాద్‌ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి నడిచి ఐమాక్స్‌ మీదుగా హుస్సేన్‌సాగర్‌ వద్దకు చేరుకుంటారు. అలాగే, ఎంఎంటీఎస్ ప్రయాణికులు కూడా ఖైరతాబాద్‌ స్టేషన్‌ నుండి రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో, మెట్రో, ఎంఎంటీఎస్‌ అనుసంధానం ఆధారంగా... ఐమాక్స్‌ మీదుగా నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్‌ పార్కు ప్రాంతాలను సంస్కరించి, సాగర్ చుట్టూ స్కైవాక్‌ నిర్మించాలని ప్రణాళిక ఉంది.

వివరాలు 

10 కిలోమీటర్ల పైనే స్కైవాక్‌ 

మొత్తం 10 కిలోమీటర్ల పైనే స్కైవాక్‌ ఉండనుంది. రోడ్డు పక్కన అవసరమైన స్థలాల్లో స్తంభాలు ఏర్పాటు చేసి, వాటిపై 6 మీటర్ల వెడల్పుతో స్కైవాక్‌ను నిర్మించనున్నారు. ఇందులో ఒక భాగం సైకిల్‌ ట్రాక్‌ కోసం, మరో భాగం నడిచే మార్గం కోసం కేటాయించబడుతుంది. ఖైరతాబాద్ మెట్రో, ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు, అలాగే పీపుల్స్‌ప్లాజా, జలవిహార్, సంజీవయ్యపార్కు, లుంబినీపార్కు, ఇందిరాపార్కు, ఎన్టీఆర్‌గార్డెన్ ప్రాంతాల్లోకి ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయబడతాయి. ఈ ప్రదేశాల్లో లిఫ్టులు కూడా ఏర్పాటు చేయనున్నారు.

వివరాలు 

ఈ ప్రాజెక్టు కోసం రూ. 500 కోట్లు ఖర్చు

ఈ ప్రాంతాలలో పలు ఫుడ్‌కోర్టులు, ఓపెన్‌ థియేటర్లు, గేమింగ్‌ జోన్లు, మినీ థియేటర్లు వంటి అనేక వినోద అవకాశాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఒకసారి స్కైవాక్‌లో ప్రవేశించిన తర్వాత పది కిలోమీటర్ల మేర నడుస్తూ హుస్సేన్‌సాగర్‌ అందాలను వీక్షించవచ్చు. ఈ మార్గం సైక్లింగ్, ఉదయపు నడక కోసం కూడా ఉపయోగపడుతుంది. పర్యాటకుల నుండి కొంత టికెట్‌ వసూలు చేయడం, అలాగే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయడం కూడా ప్రణాళికలో ఉంది. మొత్తం ఈ ప్రాజెక్టు కోసం రూ. 500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.