Page Loader
Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణకు రెయిన్ అలర్ట్..

Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2024
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలకమైన సమాచారం వెల్లడించారు. నేడు,రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడుతోంది. ఈ ద్రోణి ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మరింత రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు ఆదిలాబాద్,ఆసిఫాబాద్,యాదాద్రి,మహబూబాబాద్,నల్లగొండ,సూర్యాపేట,ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,వరంగల్,నారాయణపేట,మహబూబ్‌నగర్,వనపర్తి,జోగులాంబ గద్వాల,వికారాబాద్ జిల్లాల్లో వర్షాలకు అవకాశముందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు.

వివరాలు 

నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు

భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని చెప్పారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పొలం పనులకు, బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపారు. నేడు హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం ఉండబోతుందని చెప్పారు. ఉదయం కాస్త ఎండ ఉండే సందర్భంలో, సాయంత్రానికి మేఘాలు కమ్ముకొని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వివరాలు 

రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ 

ద్రోణి ప్రభావంతో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏపీలో నేడు కర్నూలు, నంద్యాల, అనంతపురం, అల్లూరి, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీసత్యసాయి, YSR కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.