Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జిపై 100 కిమీ వేగంతో వందే భారత్
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ రైల్ బ్రిడ్జిపై వందే భారత్ రైలు తొలిసారిగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కత్రా-బనిహాల్ రైలు మార్గంలో గరిష్ఠ వేగ పరిమితిని 100 కిలోమీటర్లకు పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడంతో ఈ వేగంతో రైలును నడిపారు. జమ్మూ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘాల్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. రైళ్ల వేగం పెరగడం వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు జమ్మూ-కశ్మీర్ ప్రాంతాల మధ్య రైలు రాకపోకలు మరింత మెరుగుపడతాయని ఆయన తెలిపారు.
వివరాలు
కత్రా-బనిహాల్ మధ్య 111 కిమీ మార్గంలో గరిష్ఠ వేగం
శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి బనిహాల్ వరకు 111 కిలోమీటర్ల మేర నిర్మించిన కొత్త బ్రాడ్గేజ్ రైలు మార్గంలో ఇకపై రైళ్లను గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు.
గతంలో కత్రా-సంగల్దాన్ మార్గంలో గరిష్ఠ వేగం గంటకు 85 కిలోమీటర్లుగా, సంగల్దాన్-బనిహాల్ మార్గంలో 75 కిలోమీటర్లుగా ఉండేది.
అయితే రైళ్ల వేగాన్ని పెంచే ముందు నిర్దేశించిన అన్ని భద్రతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
భద్రతకు సంబంధించిన అంశాలను నిర్ధారించిన అనంతరమే కొత్త వేగ పరిమితికి అనుమతి ఇచ్చినట్లు నార్తర్న్ రైల్వే వెల్లడించింది.
కొత్త వేగ పరిమితి అమల్లోకి రావడంతో కత్రా-బనిహాల్ మధ్య రైలు ప్రయాణ సమయం మరింత తగ్గనుంది.
వివరాలు
కశ్మీర్లో పర్యాటకం, వాణిజ్యానికి ఊతం
ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
మెరుగైన రైలు కనెక్టివిటీ కారణంగా జమ్మూ-కశ్మీర్లో పర్యాటక రంగంతో పాటు వాణిజ్యం,స్థానిక ఆర్థిక కార్యకలాపాలు కూడా మరింత ఊపందుకునే అవకాశం ఉందని తెలిపారు.
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా చీనాబ్ రైల్ బ్రిడ్జికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
జమ్మూ-కశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన నదీ మట్టానికి 359మీటర్లు,అంటే సుమారు 1,178అడుగుల ఎత్తులో ఉంది.
చీనాబ్ వంతెన ఎత్తు పారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35మీటర్లు ఎక్కువ కావడం మరో విశేషం. ఈ ఆర్చ్ బ్రిడ్జి పొడవు సుమారు 1,31 మీటర్లు.
ఉక్కు,కాంక్రీట్తో నిర్మించిన ఈ భారీ వంతెనను బలమైన గాలులు,భూకంపాలను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు.