Oil tanker: గన్ఫైర్ను దాటుకుని భారత్కు చేరిన ఇరాక్ చమురు ట్యాంకర్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన ఓ చమురు ట్యాంకర్ సురక్షితంగా ఒడిశాలోని పారాదీప్ పోర్ట్కు చేరుకుంది. ప్రయాణ సమయంలో నౌకపై దాడి జరిగినప్పటికీ, ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా భారత తీరానికి చేరుకోవడం విశేషంగా నిలిచింది. ఈ విషయాన్ని పారాదీప్ పోర్ట్ అథారిటీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇరాక్కు చెందిన సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును తీసుకువస్తున్న ఎంటీ సన్మార్ హెరాల్డ్ అనే ఆయిల్ ట్యాంకర్ ఇరాన్ జలాల్లో ప్రయాణిస్తున్న సమయంలో దాడికి గురైనట్లు పోర్ట్ అథారిటీ తెలిపింది. ట్యాంకర్లోని విలువైన కార్గోతో పాటు సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఘటన అనంతరం నౌక తన ప్రయాణ మార్గాన్ని మార్చుకున్నట్లు పేర్కొంది.
వివరాలు
పారాదీప్ పోర్టుకు సుమారు 22 కిలోమీటర్ల దూరంలో లంగరు
అనంతరం భారత నౌకాదళంతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ ఎలాంటి భద్రతా ఉల్లంఘనలు జరగకుండా భారత తీరంవైపు ప్రయాణాన్ని కొనసాగించినట్లు వెల్లడించింది. నౌకపై తుపాకులతో కాల్పులు జరిగినట్లు సమాచారం. అయితే ఆ కాల్పులకు పాల్పడిన వారు ఎవరు అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. తాజాగా ఈ ఆయిల్ ట్యాంకర్ పారాదీప్ పోర్టుకు సుమారు 22 కిలోమీటర్ల దూరంలో లంగరు వేసింది. అక్కడి నుంచి నౌకలో ఉన్న ఇరాక్ ముడి చమురును అన్లోడ్ చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నట్లు సమాచారం.