India-China border: ఆరేళ్ల విరామానికి ముగింపు.. ఆగస్టు 1 నుంచి నాథులా వాణిజ్యం పునఃప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పు సిక్కింలోని చారిత్రాత్మక నాథులా పాస్ ద్వారా భారత్-చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం ఆగస్టు 1 నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి, అనంతరం ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా 2020 నుంచి నిలిచిపోయిన ఈ వాణిజ్య కార్యకలాపాలు దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభం కావడం స్థానిక వ్యాపారులు, సరిహద్దు ప్రాంత ప్రజలకు ఊరటనివ్వనుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, నాథులా మార్గం పునఃప్రారంభానికి సంబంధించి భారత్, చైనా మధ్య అవసరమైన అన్ని పరిపాలనా, లాజిస్టిక్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 నుంచి వాణిజ్య కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
వివరాలు
భారత్-చైనా చర్చల ఫలితమే నిర్ణయం
ఇటీవల జరిగిన భారత్-చైనా ప్రత్యేక ప్రతినిధుల (Special Representatives) 24వ విడత చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంయుక్తంగా అధ్యక్షత వహించారు.
ఈ చర్చల్లో హిమాలయ ప్రాంతంలోని మూడు కీలక సరిహద్దు మార్గాల ద్వారా దశలవారీగా వాణిజ్యాన్ని పునరుద్ధరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అవి:
సిక్కింలోని నాథులా పాస్
హిమాచల్ ప్రదేశ్లోని షిప్కి లా
ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్
సముద్ర మట్టానికి 14 వేల అడుగులకుపైగా ఎత్తులో ఉన్న నాథులా పాస్ ఒకప్పుడు ప్రాచీన సిల్క్ రూట్లో కీలక భాగంగా గుర్తింపు పొందింది.
వివరాలు
సిక్కిం వ్యాపారులకు ఊరట
1962 భారత్-చైనా యుద్ధం అనంతరం దశాబ్దాల పాటు మూతపడిన ఈ మార్గాన్ని 2006లో మళ్లీ తెరిచారు.
అయితే 2020లో కరోనా పరిస్థితులు, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి వాణిజ్యాన్ని నిలిపివేశారు.
నాథులా పాస్ పునఃప్రారంభంతో సిక్కింలో నమోదైన సుమారు 600 మంది వ్యాపారులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది.
మార్గం మూసివేయడంతో గత ఆరు సంవత్సరాలుగా వీరు సరిహద్దు వాణిజ్యం నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారత్-చైనా ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం నాథులా మార్గంలో నిర్దిష్ట వస్తువులకే వాణిజ్యానికి అనుమతి ఉంటుంది.
భారత్ నుంచి సాధారణంగా రెడీమేడ్ దుస్తులు,దుప్పట్లు,టీ,కాఫీ,హస్తకళ ఉత్పత్తులు ఎగుమతి చేస్తారు.
చైనా టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం నుంచి ముడి పట్టు, ఉన్ని, యాక్ వెంట్రుకలు, మట్టి పాత్రలు వంటి వస్తువులు దిగుమతి అవుతాయి.
వివరాలు
కైలాస్ మానససరోవర యాత్ర తర్వాత మరో కీలక అడుగు
కొద్ది నెలల క్రితమే నాథులా మార్గం ద్వారా కైలాస్ మానససరోవర యాత్రను భారత్ పునఃప్రారంభించింది.
ఇప్పుడు అదే మార్గంలో సరిహద్దు వాణిజ్యాన్ని కూడా తిరిగి ప్రారంభించడం ద్వారా ఇరు దేశాల మధ్య పరస్పర సంబంధాలు, ప్రజల రాకపోకలు, ఆర్థిక కార్యకలాపాలను క్రమంగా సాధారణ స్థితికి తీసుకురావాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు భావిస్తున్నారు.
వివరాలు
మౌలిక వసతుల అభివృద్ధికి వేగం
నాథులా మార్గం ప్రారంభానికి ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేసింది.
ముఖ్యంగా రోంగ్లీ-మెన్లా మధ్య కొత్త జాతీయ రహదారి నిర్మాణం కొనసాగుతోంది.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉన్న పాత రహదారికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఈ రహదారి పూర్తయితే సరుకుల రవాణా మరింత సులభం కావడంతో పాటు సరిహద్దు లాజిస్టిక్స్ బలోపేతం అవుతాయని,తూర్పు సిక్కింలో పర్యాటక రంగానికీ ఊతమిస్తుందని అధికారులు చెబుతున్నారు.
నాథులా పాస్ ద్వారా సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభం కావడం వల్ల సరిహద్దు ప్రాంతాల ఆర్థికవ్యవస్థకు కొత్త ఊపు లభించడంతో పాటు భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య,ఆర్థిక సంబంధాల పునరుద్ధరణలో మరో కీలక ముందడుగుగా ఇది నిలవనుంది.