Warheads: ప్రయోగానికి సిద్ధంగా 12 వార్హెడ్లు.. దశాబ్దాల వ్యూహంలో పెను మార్పు
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటివరకు అణ్వస్త్రాల వినియోగంలో అత్యంత సంయమనం పాటిస్తూ వచ్చిన భారత్ తన వ్యూహంలో మార్పులు చేపట్టిందా? తొలిసారిగా ప్రయోగానికి సిద్ధంగా ఉండే విధంగా 12 అణు వార్హెడ్లను మోహరించిందా? అంతర్జాతీయ మేధోమథన సంస్థ స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) తాజా నివేదిక ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ అణు విధానం ప్రకారం ప్రత్యర్థిపై ముందుగా అణుదాడికి దిగకూడదనే "నో ఫస్ట్ యూజ్" సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది. దేశంపై అణుదాడి జరిగితే మాత్రమే ప్రతీకారంగా అణ్వస్త్రాలను ప్రయోగించే విధానాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో దశాబ్దాలుగా అణు వార్హెడ్లను, వాటిని లక్ష్యాలపైకి తీసుకెళ్లే క్షిపణి వ్యవస్థలను వేర్వేరుగా భద్రపరుస్తూ వస్తోంది.
వివరాలు
అత్యున్నత స్థాయి పోరాట సన్నద్ధతకు సంకేతం
అయితే, శాంతికాలంలోనూ భారత అణు వ్యూహంలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు సిప్రీ పేర్కొంది. ముఖ్యంగా క్షిపణులను తక్షణ ప్రయోగానికి అనువుగా ఉండే క్యానిస్టర్లలో నిల్వ చేయడం, అణుశక్తితో నడిచే జలాంతర్గాములు సముద్రంలో నిరంతర రక్షణ గస్తీ నిర్వహించడం వంటి పరిణామాలను పరిశీలిస్తే, కొంతమంది అణు వార్హెడ్లను లాంఛర్లతో అనుసంధానించడం లేదా వ్యూహాత్మక దళాల స్థావరాల్లో సిద్ధంగా ఉంచినట్లు అర్థమవుతోందని నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత అణ్వాయుధాగారాన్ని ఇప్పటివరకు ఉన్న "నిల్వ స్థితి" కింద కాకుండా, తొలిసారిగా "ప్రయోగానికి సన్నద్ధంగా మోహరించిన అణ్వస్త్రాలు" (ఆపరేషనల్లీ డిప్లాయ్డ్) అనే విభాగంలో సిప్రీ వర్గీకరించింది. ఇది అత్యున్నత స్థాయి పోరాట సన్నద్ధతకు సంకేతంగా భావిస్తున్నారు.
వివరాలు
సముద్రంలో వ్యూహాత్మక గస్తీ
స్వల్ప సంఖ్యలో అణు వార్హెడ్లను ఎస్ఎస్బీఎన్ శ్రేణికి చెందిన అణుశక్తి జలాంతర్గాముల్లో భారత్ మోహరించినట్లు సిప్రీ తెలిపింది. ఈ జలాంతర్గాములు ప్రస్తుతం సముద్రంలో వ్యూహాత్మక గస్తీ నిర్వహిస్తున్నాయని నివేదికలో పేర్కొంది. ఇక పొరుగు దేశాల పరిస్థితిని కూడా సిప్రీ విశ్లేషించింది. పాకిస్థాన్ ఇప్పటివరకు ఈ తరహా అణ్వస్త్రాల మోహరింపును చేపట్టలేదని పేర్కొనగా, చైనా మాత్రం ఇప్పటికే 24 అణ్వస్త్రాలను ప్రయోగ సన్నద్ధ స్థితిలో ఉంచినట్లు వెల్లడించింది. ఈ పరిణామాలు ఆసియాలో వ్యూహాత్మక సమతుల్యతపై కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.