
Crude Imports: హార్ముజ్ ముప్పుతో రష్యా, యూఎస్ చమురు దిగుమతులను పెంచిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూ, ఇజ్రాయెల్తో తగువు ముదురుతున్న తరుణంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేస్తామని ప్రకటించడం ప్రపంచ సరఫరా శ్రేణిపై ప్రభావం చూపే ప్రమాదాన్ని సృష్టించింది. దీనిని ఎదుర్కోవడానికి భారత్ ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మొదలుపెట్టింది. అందులో భాగంగానే రష్యా, అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులను పెంచింది. కెప్లర్ డేటా ప్రకారం, మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్ దిగుమతులు తగ్గుతూ, రష్యా, అమెరికా నుంచి చమురు సరఫరా పెరిగింది.
Details
రోజుకు 20-22 లక్షల బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు
జూన్ నెలలో భారత రిఫైనరీ సంస్థలు రష్యా నుంచి రోజుకు 20-22 లక్షల బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి, ఇది గత రెండు సంవత్సరాల్లోనే అత్యధికం. అంతకుముందు నెలలో రష్యా నుంచి భారత్ 19.6 లక్షల బ్యారెళ్లు దిగుమతి చేసుకోగా, మే నెలలో అమెరికా నుంచి 2.8 లక్షల బ్యారెళ్లు దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు దీన్ని 4.39 లక్షలకు పెంచుకుంది. జూన్ 1-19 మధ్య రష్యా నుంచి భారత్ ఎగుమతులు 35 శాతం పెరిగాయని కెప్లర్ నిపుణుడు సుమిత్ రిటోలియా తెలిపారు.
Details
రష్యా నుంచి మరింత కొనుగోళ్ల అవకాశాలు
తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలో అమెరికా జోక్యం పెరగడంతో, హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడితే రష్యా చమురు వాటా మరింత పెరగనుంది. భారత్ ఈ నిర్ణయంతో భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల కలగవచ్చే లభ్యత కొరత, అధిక చమురు ధరల నుంచి కొంత ఉపశమనం పొందనుంది. రాబోయే రోజుల్లో అధిక సరుకు రవాణా ఖర్చులను అధిగమించేందుకు భారత్ అమెరికా, నైజీరియా, అంగోలా, బ్రెజిల్ తదితర దేశాల వైపుకు కూడా మొగ్గుచూపే అవకాశం ఉంది.