Page Loader
PM Modi: ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో చిట్ చాట్ 
ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో చిట్ చాట్

PM Modi: ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో చిట్ చాట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

నిన్న "ఆపరేషన్ సిందూర్"పై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తెల్లవారుజామున పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఉదయం 7 గంటల సమయంలో ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ప్రధాని, పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ సమీపంలో ఉన్న ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత వైమానిక దళ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. వీరిని ప్రోత్సహిస్తూ, వారి ధైర్యాన్ని మెచ్చుకుంటూ, మద్దతు తెలియజేశారు. భారత వాయుసేన తన శక్తిని ప్రదర్శించి పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పిందని ప్రధాని మోడీ ప్రశంసించారు. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ, ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను తమ దాడుల్లో ధ్వంసం చేశామని వెల్లడించిన విషయం తెలిసిందే.

వివరాలు 

పాకిస్తాన్ వాదన పూర్తి అసత్యం 

అయితే, ప్రధాని మోదీ ప్రయాణించిన అత్యంత ప్రాముఖ్యత గల భారతీయ విమానం ఆదంపూర్ ఎయిర్‌బేస్‌పై సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, పాకిస్తాన్ వాదన పూర్తి అసత్యమని స్పష్టమైంది. ఎందుకంటే, ఒక అత్యున్నత స్థాయి వీఐవీఐపీ విమానం అక్కడ విజయవంతంగా దిగడం ద్వారా అక్కడ ఎలాంటి నష్టం జరగలేదన్న విషయం రుజువైంది. దీనితోపాటు, ఆదంపూర్ ఎయిర్‌బేస్ భారత వైమానిక దళానికి చెందిన మిగ్-29 యుద్ధ విమానాల ముఖ్య స్థావరంగా కూడా ఉంది. ఈ సందర్శనలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ప్రధాని మోడీకి తోడుగా ఉన్నారు. శత్రు దేశ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ వైమానిక స్థావరం వేగవంతమైన మెరుపుదాడులకు పేరుగాంచింది.

వివరాలు 

వాయుసేన సిబ్బందితో కలిసి ఉండటం ఒక ప్రత్యేకమైన అనుభవం: మోదీ 

తర్వాత ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఈ ఉదయం నేను ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, మా ధైర్యవంతమైన వైమానిక యోధులు, సైనికులను కలిశాను. ధైర్యం, సంకల్పం, భయరహితతకు ప్రతీకలైన ఈ వాయుసేన సిబ్బందితో కలిసి ఉండటం ఒక ప్రత్యేకమైన అనుభవం. మన దేశం కోసం సాయుధ దళాలు చేసే ప్రతి త్యాగానికి భారత్ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది" అని ఆయన పోస్ట్‌ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ  చేసిన ట్వీట్