India Labour Code: భారత్లో 4 రోజుల పని వారం సాధ్యమేనా? కేంద్ర కార్మిక శాఖ కీలక స్పష్టత
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కువగా ఉద్యోగులు వారానికి ఐదు రోజులు పనిచేసే పద్ధతినే అనుసరిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ప్రపంచంలోని కొన్ని దేశాలు ప్రయోగాత్మకంగా నాలుగు రోజుల పని వారం విధానాన్ని అమలు చేశాయి. ఈ విధానం సానుకూల ఫలితాలను అందించడంతో, భారత్లో కూడా దీనిని అమలు చేయడం సాధ్యమా అనే అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. కేంద్ర కార్మిక శాఖ ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ, కొత్త లేబర్ కోడ్స్ అమల్లో ఉన్న నేపథ్యంలో నాలుగు రోజుల పని విధానం అమలుకు అవకాశం ఉందని వెల్లడించింది.
వివరాలు
పని మధ్యలో తీసుకునే విరామాలు, బ్రేకులు కూడా ఈ 12 గంటల గణనలోకి..
అయితే దీనికి కొన్ని షరతులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటాయని పేర్కొంది. వారానికి మొత్తం పని సమయం 48గంటలను మించరాదని, అందువల్ల ఉద్యోగులు నాలుగు రోజులు పనిచేస్తే ఒక్కో రోజుకు గరిష్టంగా 12గంటల వరకు పని చేయవచ్చని వివరించింది. ఈ విధానంలో మిగిలిన మూడు రోజులు చెల్లింపు సెలవులుగా పరిగణించబడతాయి. రోజుకు 12 గంటల పని అంటే నిరంతరం అంత సమయం పని చేయాల్సిన అవసరం లేదని కార్మిక శాఖ స్పష్టం చేసింది. పని మధ్యలో తీసుకునే విరామాలు, బ్రేకులు కూడా ఈ 12 గంటల గణనలోకి వస్తాయని తెలిపింది. అయితే ఒక రోజులో నిర్ణయించిన 12 గంటలకు మించి పని చేయాల్సి వస్తే, అదనపు గంటలకు రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.
వివరాలు
29 పాత కార్మిక చట్టాలను రద్దు.. నాలుగు కొత్త లేబర్ కోడ్స్ను అమల్లోకి..
2025 నవంబర్ 21 నుంచి ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోడ్స్ను అమల్లోకి తీసుకువచ్చింది. అవి వేతనాల కోడ్-2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్-2020, సోషల్ సెక్యూరిటీ కోడ్-2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్-2020. ఈ చట్టాల ప్రధాన లక్ష్యం ఉద్యోగులకు సమయానికి వేతనాలు, నిర్దిష్టమైన పని గంటలు, మెరుగైన భద్రతా ప్రమాణాలు, ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే. కొత్త లేబర్ కోడ్స్ అమలుతో ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు కూడా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా సెలవులు, ఆరోగ్య భీమా, సామాజిక భద్రత వంటి లాభాలు పొందే అవకాశం కలిగింది.
వివరాలు
గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు, అగ్రిగేటర్ వర్కర్ల గుర్తింపు
గ్రాట్యుటీ విషయంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు గ్రాట్యుటీకి అర్హత పొందాలంటే కనీసం ఐదు సంవత్సరాల సేవ అవసరమైతే, ఇప్పుడు నిరంతరంగా ఒక సంవత్సరం పని చేసిన వారికే అర్హత లభిస్తుంది. అలాగే తొలిసారిగా గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు, అగ్రిగేటర్ వర్కర్లను అధికారికంగా గుర్తించారు. ఆధార్తో అనుసంధానమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ ద్వారా వారి సంక్షేమ నిధులు ఎక్కడికైనా మారే విధంగా పోర్టబుల్గా మారాయి. ఈ అన్ని పరిణామాలను పరిశీలిస్తే, భవిష్యత్తులో భారత్లో కూడా నాలుగు రోజుల పని విధానం అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.