LOADING...
India-Pakistan: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ను తిప్పికొట్టిన భారత్.. బంగ్లా అత్యాచారాల ప్రస్తావన 
బంగ్లా అత్యాచారాల ప్రస్తావన

India-Pakistan: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ను తిప్పికొట్టిన భారత్.. బంగ్లా అత్యాచారాల ప్రస్తావన 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, అసలు చర్చను మరల్చే ప్రయత్నం చేసిన పాకిస్థాన్‌కు భారత్ ఘాటుగా సమాధానం చెప్పింది. పాకిస్థాన్ చేసిన బూటకపు ప్రచారాన్ని తిప్పికొడుతూ, 1971లో బంగ్లాదేశ్‌లో ఆ దేశ సైన్యం జరిపిన సామూహిక అత్యాచారాలు, మారణహోమం గురించి గుర్తుచేసి, పాకిస్థాన్ అసలైన స్వరూపాన్ని ప్రపంచం ముందుంచింది. భద్రతా మండలిలో సోమవారం "మహిళలు, శాంతి, భద్రత" అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ చర్చలో పాకిస్థాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ అనూహ్యంగా కశ్మీర్ విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పి. హరీశ్, పాకిస్థాన్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు.

వివరాలు 

పాక్ ప్రచారాన్ని ప్రపంచం నమ్మదంటూ వ్యాఖ్యలు 

"1971లో 'ఆపరేషన్ సెర్చ్‌లైట్' పేరిట తమ సొంత సైన్యంతోనే సుమారు 4 లక్షల మహిళలపై పాకిస్థాన్ క్రూరంగా సామూహిక అత్యాచారాలకు పాల్పడింది.తమ ప్రజలపైనే బాంబులు వేసి,జాతి నిర్మూలనకు దిగిన దేశం,ఇప్పుడు కట్టుకథలు చెప్పి ప్రపంచ దృష్టిని మళ్లించాలని చూస్తోంది," అని హరీశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ వాదనలు పూర్తిగా కల్పితాలు,భ్రమలతో నిండినవని,ఆ దేశపు అబద్ధపు ప్రచారాన్ని ప్రపంచం గమనిస్తోందని ఆయన తెలిపారు. హరీశ్ మాట్లాడుతూ,ప్రతి అంశంలోనూ పాకిస్థాన్ కశ్మీర్ పేరును లేవనెత్తుతుందే కానీ,ఏ దేశం కూడా ఇప్పుడు వారి వాదనలను పట్టించుకోవడం లేదని అన్నారు. గత వారంలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సంస్కరణలు కోరుతూ జరిగిన నిరసనల్లో 12 మంది పౌరులను పాక్ భద్రతా దళాలు క్రూరంగా హతమార్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

వివరాలు 

శాంతిస్థాపనలో భారత మహిళల పాత్రను వివరించిన భారత్ 

తర్వాత హరీశ్ శాంతిస్థాపనలో భారత పాత్రను వివరించారు. భద్రతా మండలి తీర్మానాలు వచ్చే దశాబ్దాలకంటే ముందే భారత్ ఈ సూత్రాలకు కట్టుబడి ఉందని చెప్పారు. "1960లో కాంగోలో జరిగిన ఐరాస శాంతి ఆపరేషన్లలో భారత మహిళా వైద్యాధికారులు పాల్గొన్నారు. 2007లో లైబీరియాకు పంపిన ప్రపంచంలోని తొలి పూర్తిస్థాయి మహిళా పోలీస్ యూనిట్ కూడా భారతదేశానిదే. ఆ యూనిట్ స్థానిక మహిళల్లో స్ఫూర్తి నింపి, వారిని శాంతి నిర్మాణంలో భాగస్వాములుగా మార్చింది," అని వివరించారు. "శాంతి స్థాపనలో మహిళలు పాల్గొనగలరా?" అన్న ప్రశ్న ఇప్పుడు గతం అయిపోయిందని, "మహిళలు లేకుండా శాంతి స్థాపన సాధ్యమా?" అనేదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారిందని హరీశ్ గట్టిగా చెప్పారు.

వివరాలు 

శాంతిస్థాపనలో భారత మహిళల పాత్రను వివరించిన భారత్ 

న్యూఢిల్లీలోని ఇండియన్ ఆర్మీ సెంటర్ ఫర్ యునైటెడ్ నేషన్స్ పీస్‌కీపింగ్ ద్వారా భారత్ అనేక దేశాల మహిళా సైనికాధికారులకు శిక్షణ అందిస్తోందని ఆయన వివరించారు.