LOADING...
Bullet train corridors: భారత్‌లో మరో 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.. ముంబై-పుణె 48 నిమిషాల్లోనే ప్రయాణం
భారత్‌లో మరో 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.. ముంబై-పుణె 48 నిమిషాల్లోనే ప్రయాణం

Bullet train corridors: భారత్‌లో మరో 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.. ముంబై-పుణె 48 నిమిషాల్లోనే ప్రయాణం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 26, 2026
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో బుల్లెట్ ట్రైన్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు కీలక ముందడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేయనున్న తదుపరి తరం బుల్లెట్ రైళ్లు B35 రూపకల్పన, నిర్మాణం కోసం అర్హత కలిగిన కంపెనీల ఎంపిక ప్రక్రియను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ప్రారంభించింది. భారత్‌లోనే తయారయ్యే ఈ B35 రైళ్లు భవిష్యత్తులో దేశంలోని అన్ని బుల్లెట్ ట్రైన్ కారిడార్లలో ప్రధాన హైస్పీడ్ రైళ్లుగా సేవలందించనున్నాయి. B35 బుల్లెట్ ట్రైన్ గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నారు. సాధారణ ఆపరేషన్ సమయంలో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. దీంతో ఇవి భారత్‌లో ప్రతిపాదించిన అత్యంత వేగవంతమైన రైళ్లలో ఒకటిగా నిలవనున్నాయి.

వివరాలు

నగరాల మధ్య తగ్గనున్న ప్రయాణ సమయం..

ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి కారిడార్లు ఉన్నాయి. ఈ హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 1 గంట 57 నిమిషాల్లో చేరుకోవచ్చు. ముంబై-పుణె మధ్య ప్రయాణం 48 నిమిషాల్లో పూర్తవుతుంది. బెంగళూరు నుంచి చెన్నైకి 73 నిమిషాలు, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు 2 గంటల 10 నిమిషాలు, పుణె నుంచి హైదరాబాద్‌కు 2 గంటల 8 నిమిషాలు పడుతుంది. అలాగే ఢిల్లీ నుంచి లక్నోకు 2 గంటలు, ఢిల్లీ నుంచి వారణాసికి 3 గంటల 15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు

స్వదేశీ సాంకేతికతతో రూపొందిన బుల్లెట్ ట్రైన్స్..

ఇదిలా ఉండగా, 508 కిలోమీటర్ల పొడవైన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో తొలి దశగా గుజరాత్‌లోని 97 కిలోమీటర్ల సూరత్-వాపి సెక్షన్‌ను 2027 ఆగస్టు నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని NHSRCL లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశంలోని తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ప్రారంభమయ్యే మొదటి ఆపరేషనల్ సెక్షన్ కానుంది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న B35 బుల్లెట్ ట్రైన్లు భవిష్యత్తులో భారత్ హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ విస్తరణలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఒకేసారి పలు కారిడార్లలో వేగవంతమైన, స్వదేశీ సాంకేతికతతో రూపొందిన బుల్లెట్ ట్రైన్ సేవలను అందించేందుకు ఇవి దోహదపడనున్నాయి.

Advertisement