LOADING...
AI Impact Summit 2026: నేడు భారత్ మండపంలో ఏఐ ఎక్స్‌పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
నేడు భారత్ మండపంలో ఏఐ ఎక్స్‌పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

AI Impact Summit 2026: నేడు భారత్ మండపంలో ఏఐ ఎక్స్‌పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో కృత్రిమ మేధస్సు రంగానికి మరో కీలక ఘట్టంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 నేటి నుంచి న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. సమగ్రమైన, బాధ్యతాయుతమైన, బలమైన ఏఐ భవిష్యత్తు రూపకల్పన లక్ష్యంగా ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతుండగా,నేటి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026ను ప్రారంభించనున్నారు. సమ్మిట్‌తో పాటు ఈ ఎక్స్‌పోలో 'ప్రజలు-ప్లానెట్-ప్రగతి' అనే మూడు థీమ్‌లతో 300కుపైగా ప్రదర్శన ప్యావిలియన్లు, లైవ్ డెమోలు ఏర్పాటు చేయగా,600కుపైగా స్టార్టప్‌లు,13 దేశాల ప్యావిలియన్లు పాల్గొని ఏఐ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రదర్శించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, అకడమియా, పరిశోధనా సంస్థలు,కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ భాగస్వాములు ఈ వేదికపై భేటీ కానున్నారు.

వివరాలు 

తొలి రోజు రోడ్డు భద్రతపై ఏఐ పాత్రపై దృష్టి

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందిస్తూ, ప్రపంచ నలుమూలల నుంచి నేతలు భారత్‌కు రావడం మన యువత సామర్థ్యానికి నిదర్శనమని, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో దేశం వేగంగా ముందుకు సాగుతూ ప్రపంచ అభివృద్ధికి తోడ్పడుతోందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 16న ప్రారంభమయ్యే తొలి రోజు రోడ్డు భద్రతపై ఏఐ పాత్రపై దృష్టి సారించనుండగా, ప్రమాదాల నమూనాలు అర్థం చేసుకోవడం,ప్రమాదాలను ముందే అంచనా వేయడం,డేటా ఆధారిత పరిష్కారాలతో భద్రత మెరుగుపరచడం వంటి అంశాలపై రవాణా మంత్రిత్వ శాఖ, ఐఐటీలు, ఇతర రంగాల నిపుణులు చర్చించనున్నారు. అలాగే విద్య-ఉపాధి భవిష్యత్తులో ఏఐ ప్రభావం, న్యాయవ్యవస్థలో ఏఐతో సమర్థత, పారదర్శకత పెంపు, కేసుల నిర్వహణ వేగవంతం, వర్చువల్ కోర్టులు, పెండింగ్ తగ్గింపు వంటి అంశాలపై కీలక సెషన్లు ఉంటాయి.

వివరాలు 

వ్యవసాయానికి ఏఐ పరిష్కారాలపై ప్రత్యేక సెషన్

విభిన్న సంస్కృతుల్లో సామాజిక నిబంధనలు పరిగణనలోకి తీసుకోకుండా అమలు చేసే ఏఐ వ్యవస్థలు ఎదుర్కొనే సవాళ్లపై చర్చ జరగనుండగా, ఏఐ యుగంలో ఉద్యోగ అవకాశాలు-రిస్కిల్లింగ్ అవసరాలపై నిపుణులు అభిప్రాయాలు పంచుకోనున్నారు. వ్యవసాయ రంగంలో స్థిరమైన, వాతావరణ సహన వ్యవసాయానికి ఏఐ పరిష్కారాలపై ప్రత్యేక సెషన్ కూడా ఉంది. గ్లోబల్ సౌత్‌లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ ఏఐ సమ్మిట్‌గా నిలిచిన ఈ కార్యక్రమం, ప్రజల కేంద్రంగా ఏఐ ప్రభావం, సమగ్ర వృద్ధి, సామాజిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ముందుకు సాగుతుండగా, పారిస్, బెర్లిన్, ఒస్లో, న్యూయార్క్, జెనీవా, బ్యాంకాక్, టోక్యో నగరాల్లో జరిగిన సంప్రదింపుల అనంతరం 'ప్రజలు-ప్లానెట్-ప్రగతి' అనే సూత్రాల ఆధారంగా ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

Advertisement