UN: ఇస్లామోఫోబియా పేరుతో కల్పిత కథలు.. యూఎన్లో పాకిస్థాన్పై భారత్ కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్పై భారత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. "ఇస్లామోఫోబియా పేరుతో కల్పిత కథలు సృష్టిస్తున్న దేశంగా భారత పశ్చిమ పొరుగు నిలుస్తోంది" అంటూ పరోక్షంగా విమర్శించింది. సోమవారం (మార్చి 16) జరిగిన కార్యక్రమంలో భారత్ ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించింది. మత వివక్షను ఒక్క మతానికి పరిమితం చేయకుండా అన్ని మతాల పట్ల సమానంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని భారత్ పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC), యునైటెడ్ నేషన్స్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ (UNAOC) కలిసి నిర్వహించాయి. ఇందులో భారత రాయబారి హరిష్ పర్వతనేని పాల్గొన్నారు.
వివరాలు
ఇస్లామోఫోబియా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం
ఈ సందర్భంగా హరిష్ పర్వతనేని మాట్లాడుతూ.. 'ఏ మతం పేరుతోనైనా జరిగే హింసను భారత్ ఖండిస్తుందని చెప్పారు. "ఏ మతమైనా సరే, మతం పేరుతో జరిగే ద్వేషం, హింసను మా ప్రతినిధి బృందం తీవ్రంగా ఖండిస్తుంది" అని తెలిపారు. ఇదే సందర్భంలో రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. భారత్ మత వైవిధ్యానికి నిలయమని, ఇక్కడ హిందూమతం, బౌద్ధం, జైనిజం, సిక్కిజం వంటి అనేక మతాలు పుట్టాయని గుర్తు చేశారు. "ప్రపంచంలో మత వివక్ష లేకుండా ఉండాల్సిన అవసరం ఏమిటో భారత్కు బాగా తెలుసు" అని అన్నారు. భారత రాజ్యాంగంలోని "సర్వ ధర్మ సమభావం" సిద్ధాంతం అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
మతాన్ని రాజకీయంగా వాడొద్దు
మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడడం ప్రమాదకరమని పర్వతనేని హెచ్చరించారు. అలాంటి చర్యలు సమస్యలను పరిష్కరించకపోగా మరింత విభేదాలను పెంచుతాయని అన్నారు. "చరిత్ర చూస్తే మతాన్ని రాజకీయంగా వాడటం సమస్యలను పరిష్కరించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది విభజనలకు దారితీసే కథనాలకు బలం ఇస్తుంది" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
పాకిస్తాన్పై పరోక్ష విమర్శలు
పాకిస్తాన్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా,భారత పశ్చిమ పొరుగుదేశాన్ని ఉద్దేశించి ఆయన ఘాటుగా స్పందించారు. "అహ్మదీయ్యాలపై జరుగుతున్న నిర్బంధం,నిరాశ్రయ అఫ్గాన్లను తిరిగి పంపించడం, రంజాన్ నెలలో వైమానిక దాడులు.. ఇవన్నీ ఎలా వర్ణిస్తారు?" అంటూ ప్రశ్నించారు. భారత్ను ముస్లింలకు వ్యతిరేకంగా చూపించే ప్రచారాలను కూడా ఆయన ఖండించారు. "200 మిలియన్లకు పైగా ముస్లింలు ఉన్న భారత్ ప్రపంచంలోనే పెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశాలలో ఒకటి" అని తెలిపారు.
వివరాలు
పాకిస్తాన్పై పరోక్ష విమర్శలు
"మా పశ్చిమ పొరుగు దేశం OIC ను భారత్పై ఆయుధంగా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ మా దేశంపై చేసే ఆరోపణలు అసత్యం, ఆధారంలేనివి" అని అన్నారు. జమ్ముకశ్మీర్ సహా భారత్లోని ముస్లింలు తమ ప్రతినిధులను తామే ఎన్నుకుంటారని ఆయన స్పష్టం చేశారు. "ఇక్కడ కనిపిస్తున్న అసలు 'ఫోబియా' అనేది మతాల మధ్య సమగ్రత, శాంతియుత సహజీవనంపై వ్యతిరేక భావనే" అని వ్యాఖ్యానించారు. చివరగా, అన్ని రకాల మత ద్వేషం, హింస లేని ప్రపంచానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.