
Hydro projects:పాకిస్తాన్ కు వరుసగా షాకులిస్తున్న కేంద్రం.. జల విద్యుత్ ప్రాజెక్టులపై పని ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్పై కేంద్రం మరొక భారీ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం,ఇప్పుడు ఆ ఒప్పందంతో సంబంధం ఉన్న రెండు కీలక జలవిద్యుత్ ప్రాజెక్టుల పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టింది.
ఈ ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమైతే, సింధు నదికి అనుబంధంగా ఉన్న ఉపనదుల నుంచి పాకిస్తాన్కు చేరే నీటి ప్రవాహంలో ఆటంకం కలగవచ్చని అంచనా.
హిమాలయ పర్వత ప్రాంతంలోని కాశ్మీర్లో ఉన్న రెండు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టుల రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే పనులను భారత్ మొదలుపెట్టింది.
పాకిస్తాన్తో ఏర్పడిన తాజా ఉద్రిక్తతల దృష్ట్యా, గతంలో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేయడం లేదని భారత్ స్పష్టం చేసింది.
వివరాలు
ఈసారి భిన్నంగా స్పందించిన కేంద్రం
ఇది భారత్కు ఈ ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని వల్ల పాకిస్తాన్కు నీటి లభ్యత స్థిరంగా తగ్గే అవకాశముందని భావిస్తున్నారు.
ఒప్పందం 1960లో కుదిరినప్పటికీ, అప్పటి నుండి ఇప్పటివరకు మూడు యుద్ధాలు జరిగినా,అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం గౌరవిస్తూ వచ్చింది.
కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఈసారి భిన్నంగా స్పందించింది. NHPC లిమిటెడ్ అనే భారతదేశ అతిపెద్ద జలవిద్యుత్ సంస్థ, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కలిసి ఈ రెండు ప్రాజెక్టుల రిజర్వాయర్లలో పేరుకుపోయిన మట్టిని తొలగించే పనులను ప్రారంభించాయి.
ఈక్రమంలో రిజర్వాయర్ల సామర్థ్యాన్ని కూడా పెంచే చర్యలు చేపట్టనున్నారు.
వివరాలు
పాకిస్తాన్కు నీటి కొరత ఏర్పడే అవకాశం
ఇంకా ప్రస్తుతం ఈ చర్యలతో పాకిస్తాన్కు తక్షణమే నీటి కొరత ఏర్పడే అవకాశం తక్కువగానే ఉంది.
ఎందుకంటే భారత్ నదులపై ఆధారపడి తన అవసరాల కోసం నీటిని వినియోగిస్తుంది.
అయితే ఇతర ప్రాజెక్టులపై కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభిస్తే పాకిస్తాన్పై దీర్ఘకాలిక ప్రభావం తప్పదు.
ఇప్పటికే సింధు ఉపనదుల నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఎలాంటి యత్నం చేసినా ప్రతిస్పందన ఇస్తామని పాకిస్తాన్ పునరుద్ఘాటించిన నేపథ్యంలో, భారత్ చేపట్టిన తాజా చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.