Trade deal: భారత గార్మెంట్లకు అమెరికా మార్కెట్లో ఊరట.. పీయూష్ గోయల్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్యాక్ట్షీట్ను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల సవరించిన నేపథ్యంలో, న్యూఢిల్లీకి మరిన్ని రాయితీలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కీలక ప్రకటన చేస్తూ, అమెరికా బంగ్లాదేశ్కు ఇచ్చినట్లే భారత్కూ టెక్స్టైల్ రంగంలో వాణిజ్య ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. అమెరికా నుంచి పత్తి ముడి సరుకును కొనుగోలు చేసి, దానితో దుస్తులు తయారు చేసి ఎగుమతి చేస్తే, తుది ఒప్పందం కుదిరిన తర్వాత భారతీయ గార్మెంట్లకూ అమెరికా మార్కెట్లో సున్నా సుంకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా-బంగ్లాదేశ్ ఒప్పందం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత టెక్స్టైల్, అపారెల్ ఎగుమతిదారులకు ఇది ఊరటగా మారనుంది.
వివరాలు
భారత టెక్స్టైల్ ఎగుమతుల్లో సుమారు 30 శాతం అమెరికాకే..
ఈ ఒప్పందంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 'ట్రంప్కు పూర్తిగా లొంగిపోవడమే' అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో గోయల్ స్పందిస్తూ, బంగ్లాదేశ్కు భారత్కన్నా ఎక్కువ లాభాలు వచ్చాయన్నది అబద్ధమని మండిపడ్డారు. ప్రస్తుత మధ్యంతర ఒప్పంద రూపకల్పనలో ఈ నిబంధన కనిపించకపోయినా, తుది ఒప్పందంలో ఇది ఖచ్చితంగా ఉంటుందని గోయల్ తెలిపారు. ఇప్పటికే అమెరికా నుంచి దిగుమతి చేసే ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ పత్తిపై భారత్ సుంక రాయితీలు ఇచ్చినా, అమెరికన్ పత్తితో చేసిన రెడీ గార్మెంట్లకు సున్నా సుంకం ఇంకా లభించలేదు. ఈ రాయితీ అమల్లోకి వస్తే, భారత్కు ముఖ్యమైన కార్మిక ఆధారిత టెక్స్టైల్ రంగానికి ఇది పెద్ద ఊతమవుతుంది. ప్రస్తుతం భారత టెక్స్టైల్ ఎగుమతుల్లో సుమారు 30 శాతం అమెరికాకే వెళ్తున్నాయి.
వివరాలు
భారత పత్తి ఎగుమతిదారులపై ఒత్తిడి పెరిగే అవకాశం
ఇటీవల ట్రంప్ భారత్పై విధించిన టారిఫ్లను 50 శాతం నుంచి 18శాతానికి తగ్గించడంతో ఎగుమతిదారులు ఆనందించారు. అయితే బంగ్లాదేశ్తో అమెరికా ఒప్పందం కుదరడంతో అక్కడి గార్మెంట్లకు అమెరికన్ పత్తితో తయారైతే సున్నా సుంకం వర్తించడం భారత్కు పోటీగా మారింది. దీని వల్ల భారత పత్తి ఎగుమతిదారులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.ఈ పరిస్థితుల్లో భారత్ కూడా బంగ్లాదేశ్ మాదిరిగానే రాయితీ పొందితే, దేశీయ టెక్స్టైల్ పరిశ్రమలో ఉన్న ఆందోళనలు చాలా వరకు తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ కొన్ని క్లెయిమ్లను తొలగిస్తూ ఫ్యాక్ట్షీట్ను సవరించింది. మార్చి మధ్యలో తుది ఒప్పందం కుదిరేలోపు మరిన్ని రాయితీలు వస్తాయా అనే అంశంపై రాబోయే వారాలు స్పష్టత ఇవ్వనున్నాయి.