
Modi-Keir Starmer: భారత్-బ్రిటన్ సహజ భాగస్వాములు: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ భారత్ సందర్శనలో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం ముంబయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కీర్ స్టార్మర్ల మధ్య భేటీ జరిగింది. ముంబయి రాజ్భవన్లో జరిగిన ఈ సమావేశానికి హాజరైన స్టార్మర్కు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్ (మునుపటి ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను మరింతగా బలోపేతం చేసేందుకు కలిసి ముందుకు సాగుతున్నామని ఆయన పోస్టులో పేర్కొన్నారు.
వివరాలు
ఇరుదేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ ప్రవేశం సులభతరం
గత జూలైలో భారత్-బ్రిటన్ల మధ్య 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' (ఎఫ్టీఏ) కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ద్వారా ఇరుదేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ ప్రవేశం సులభతరం అవుతుందని అప్పట్లో రెండు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఒప్పందం నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ 125 మంది ప్రతినిధుల బృందంతో భారత్కు వచ్చారు. 2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్న భారత్తో కుదిరిన ఈ ఒప్పందం బ్రిటన్ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని స్టార్మర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగిన అనంతరం భారత్తో కుదిరిన ఈ ఒప్పందం తమ దేశానికి అత్యంత ప్రాధాన్యత కలిగిందని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
బ్రిటన్ ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులపై తగ్గనున్న టారిఫ్
అలాగే బ్రిటన్ నుంచి భారత్కు ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులపై విధించే సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గుతాయని యూకే ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ద్వైపాక్షిక బంధాలను మరింత విస్తృతం చేసేందుకు ప్రధానమంత్రి మోదీ, కీర్ స్టార్మర్లు తాజా చర్చలు జరిపినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.
వివరాలు
భారతదేశంలో క్యాంపస్లను ప్రారంభించనున్న తొమ్మిది UK విశ్వవిద్యాలయాలు
యునైటెడ్ కింగ్డమ్లోని తొమ్మిది ప్రముఖ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో క్యాంపసులు ప్రారంభిస్తాయని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందులో మూడు క్యాంపసులు గిఫ్ట్ సిటీలో ఏర్పాటు అవుతున్నాయి. ఇది బ్రిటన్ను "భారతదేశంలో ఉన్నత విద్యను అందించే ప్రముఖ అంతర్జాతీయ ప్రదాత"గా మారుస్తుందని స్టార్మర్ అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతా సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం నిబద్ధతను మోడీ పునరుద్ఘాటించారు. కీలకమైన ఖనిజాలపై సహకారం కోసం భారతదేశం, UK ఒక ఇండస్ట్రీ గిల్డ్, సరఫరా గొలుసు అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయని, దాని ఉపగ్రహ ప్రాంగణం ISM ధన్బాద్లో ఉందని ఆయన అన్నారు.