Loading...
New Rail line: తెలంగాణకు గుడ్‌న్యూస్.. ముకుట్‌బన్-గడ్చాందూర్ మధ్య కొత్త రైల్వే లైన్!
తెలంగాణకు గుడ్‌న్యూస్.. ముకుట్‌బన్-గడ్చాందూర్ మధ్య కొత్త రైల్వే లైన్!

New Rail line: తెలంగాణకు గుడ్‌న్యూస్.. ముకుట్‌బన్-గడ్చాందూర్ మధ్య కొత్త రైల్వే లైన్!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి మరో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. యవత్మాల్ జిల్లాలోని ముకుట్‌బన్, చంద్రపూర్ జిల్లాలోని గడ్చాందూర్ మధ్య ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలు పారిశ్రామిక, మైనింగ్ కార్యకలాపాలకు కీలక కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ అనేక సిమెంట్ ప్లాంట్లు, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనులు, సున్నపురాయి గనులు ఉన్నాయి.

వివరాలు 

పారిశ్రామిక ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ

ముకుట్‌బన్-గడ్చాందూర్ మధ్య కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే పారిశ్రామిక ప్రాంతాలకు నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దీంతో బొగ్గు, సిమెంట్, సున్నపురాయి తదితర ఉత్పత్తుల సరుకు రవాణా మరింత సులభం కానుంది.

ప్రస్తుతం ఉన్న వార్ధా-మాణిక్‌గఢ్ సెక్షన్‌పై రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు రవాణా ఖర్చులు, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతాయని భావిస్తున్నారు.

వివరాలు 

ఏటా 6.08 మిలియన్ టన్నుల సరుకు రవాణా అంచనా

ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) ప్రకారం.. నిర్మాణం పూర్తయిన తర్వాత రోజుకు రెండు దిశల్లో రెండు మెము (MEMU) రైళ్లను నడిపే అవకాశం ఉంది.

అలాగే ఏడాదికి 6.08 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయవచ్చని అధికారులు అంచనా వేశారు.

ఈ సరుకు రవాణాలో బొగ్గు, కోక్, సిమెంట్, స్పాంజ్ ఐరన్, మెటల్ స్క్రాప్, ఇనుము, ఉక్కు, ఎరువులు, ఆహార ధాన్యాలు తదితర ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు.

దీంతో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సరుకు రవాణా సామర్థ్యం పెరగనుంది.

ADVERTISEMENT

వివరాలు 

మాజ్రి-నాందేడ్ మార్గంతో అనుసంధానం

ప్రతిపాదిత కొత్త రైల్వే లైన్ బొగ్గు, సిమెంట్ క్లస్టర్లను మాజ్రి-నాందేడ్ మార్గంతో నేరుగా అనుసంధానించగలదని అధికారులు తెలిపారు.

ఈ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే జాల్నా, పర్భానీ, ఛత్రపతి శంభాజీనగర్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు బొగ్గు, సిమెంట్, ఇతర సరుకులను మరింత వేగంగా తరలించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రధాన రైల్వే మార్గాలపై తగ్గనున్న ఒత్తిడి

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎప్పుడూ రద్దీగా ఉండే బల్హార్షా-నాగ్‌పూర్ హై-డెన్సిటీ నెట్‌వర్క్ మార్గంపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు.

అలాగే యవత్మాల్, చంద్రపూర్ జిల్లాల్లో ప్రస్తుతం తక్కువ రైల్వే కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

ఈ కొత్త రైల్వే లైన్ వల్ల ఆయా ప్రాంతాల్లో రైల్వే మౌలిక సదుపాయాలు మెరుగుపడి, పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి ఊతం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

వివరాలు 

ప్రయాణికులు, పరిశ్రమలకు ప్రయోజనం

కొత్త రైల్వే లైన్ ప్రాంతీయ రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచుతుందని అధికారులు తెలిపారు.

నిత్యావసర వస్తువుల రవాణా సులభతరం కావడంతో పాటు పెరుగుతున్న సరుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అలాగే ఈ ప్రాజెక్టు పారిశ్రామిక, ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడంతో పాటు ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుందని అధికారులు తెలిపారు.

ADVERTISEMENT