LOADING...
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల ప్రీ-గ్రౌండింగ్‌ సమావేశాల ఏర్పాటుకు యంత్రాంగం సిద్ధం 
ఇందిరమ్మ ఇళ్ల ప్రీ-గ్రౌండింగ్‌ సమావేశాల ఏర్పాటుకు యంత్రాంగం సిద్ధం

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల ప్రీ-గ్రౌండింగ్‌ సమావేశాల ఏర్పాటుకు యంత్రాంగం సిద్ధం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2025
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అధికారులు సిద్ధం చేశారు. ఈ క్రమంలో, ఇళ్ల నిర్మాణానికి గ్రౌండింగ్‌ కార్యక్రమం చేపట్టేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా, మొదటగా ఆయా గ్రామాల్లో ప్రీ-గ్రౌండింగ్‌ సమావేశాల నిర్వహణ కోసం యంత్రాంగం సిద్ధమవుతోంది. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్లను ఎలా నిర్మించుకోవాలి, నిర్మాణ సామగ్రి సరఫరా, ఇతర అనుమానాలను ఈ సమావేశాల్లో నివృత్తి చేయనున్నారు.

వివరాలు 

వివరించనున్న ముఖ్యాంశాలు: 

ఇందిరమ్మ యాప్‌ సర్వే సమయంలో లబ్ధిదారుడు తన సొంత స్థలాన్ని చూపిన ప్రదేశంలోనే ముగ్గు వేయాల్సి ఉంటుంది. ఇతర ఎక్కడైనా నిర్మించేందుకు అనుమతించరు, అలా కట్టుకుంటే ఆ ఇంటిని రద్దు చేస్తారు. ముగ్గు వేసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందించాలి. అనంతరం, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఫొటోలు తీసి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అలాగే, నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్‌ చేస్తారు. ఇంటి నిర్మాణ విస్తీర్ణం కనీసం 400 చదరపు అడుగులు ఉండాలి. ముగ్గు వేసే దశలో ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం అందించదు. కానీ, పునాది పూర్తి అయిన వెంటనే మొదటి విడతలో భాగంగా రూ.1,00,000 లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతుంది.

వివరాలు 

వివరించనున్న ముఖ్యాంశాలు: 

ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుక అందించనున్నారు. ఇందుకు సంబంధించిన కూపన్లను తహసీల్దార్/ఆర్డీవో ద్వారా పంపిణీ చేస్తారు. సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకు అందించేందుకు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఈ/ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇంటి నిర్మాణ ప్రగతిని అంచనా వేసి, లబ్ధిదారుడికి జమ చేసే డబ్బును సిఫార్సు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రీ-గ్రౌండింగ్‌ సమావేశాలు పూర్తి కాగా, మిగిలిన గ్రామాల్లో ఒక వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

వివరాలు 

21 నియోజకవర్గాల్లో వెయ్యికిపైగా ఇళ్ల మంజూరు 

ప్రభుత్వం మొదటి విడతలో 71,482 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 21 నియోజకవర్గాల్లో వెయ్యికిపైగా ఇళ్లు కేటాయించారు. అత్యధికంగా హుజూర్‌నగర్‌లో 2,528 ఇళ్లు మంజూరు చేయగా, మిగతా నియోజకవర్గాల్లో కేటాయింపులు ఇలా ఉన్నాయి: మంథని-1,952,బోథ్‌-1,538,పరకాల-1,501,హుస్నాబాద్‌ - 1,381, సిర్పూర్‌ - 1,324, దుబ్బాక - 1,271, పరిగి - 1,264, బెల్లంపల్లి - 1,206, జహీరాబాద్‌ - 1,205, పెద్దపల్లి - 1,198, కోదాడ - 1,152, చొప్పదండి - 1,121, పినపాక - 1,113, దేవరకొండ - 1,091, ములుగు - 1,080, ఆసిఫాబాద్‌ - 1,067, కొడంగల్‌ - 1,046, అందోలు - 1,040, తుంగతుర్తి - 1,014,గజ్వేల్ - 1,001. ఇతర నియోజకవర్గాల్లో వెయ్యి లోపే ఇళ్లను కేటాయించారు.