LOADING...
Infosys: విశాఖలో 20 ఎకరాల్లో 7,000 సీట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ ఏర్పాటు
విశాఖలో 20 ఎకరాల్లో 7,000 సీట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ ఏర్పాటు

Infosys: విశాఖలో 20 ఎకరాల్లో 7,000 సీట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన సమాచార సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విశాఖపట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సాంకేతిక సంస్థ ఇన్ఫోసిస్ విశాఖలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో 7 వేల మంది ఉద్యోగులు పనిచేసేలా 20 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయించింది. గత రెండేళ్లలో ఇన్ఫోసిస్ విశాఖలో తన కార్యకలాపాలను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. 2024 ప్రారంభంలో కేవలం 250 మందితో ప్రారంభమైన సంస్థ, ప్రస్తుతం సుమారు 1,900 మంది ఉద్యోగులతో కొనసాగుతోంది.

వివరాలు 

స్థానిక ప్రతిభకే పెద్దపీట

త్వరలో మరో 750 సీట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పుడు ఏకంగా 7 వేల సీట్లతో భారీ కార్యాలయ సముదాయాన్ని నిర్మించాలన్న నిర్ణయం, ఈ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాల అవకాశాలపై సంస్థకు ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ విస్తరణలో అత్యంత ముఖ్యమైన అంశం స్థానిక ప్రతిభకు పెద్దపీట వేయడం. ఇన్ఫోసిస్ విశాఖ కేంద్రం కోసం ఇప్పటికే వెయ్యికి పైగా కొత్తగా విద్య పూర్తి చేసిన యువకులను, మరో 500 మంది అనుభవజ్ఞులను స్థానికంగా నియమించుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పులు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని ఇది సూచిస్తోంది.

వివరాలు 

ప్రభుత్వ ప్రోత్సాహం.. పర్యావరణ వ్యవస్థ

విశాఖను సమాచార సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తోంది. ఆధునిక విధానాలు ప్రవేశపెట్టడం, పరిశ్రమలు-విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా సంస్థలు తమ కార్యకలాపాలను సులభంగా విస్తరించుకునే పరిస్థితులను కల్పిస్తోంది. ఈ విధానం వల్ల గతంలో కొనసాగిన ప్రతిభ వలసలు తగ్గుముఖం పడుతున్నాయి.

Advertisement

వివరాలు 

మంత్రి నారా లోకేశ్‌ హర్షం

ఈ పరిణామంపై రాష్ట్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ ఐటీ కేంద్రంగా ఎదగడం స్థానిక ప్రతిభకు, ప్రభుత్వం కల్పిస్తున్న అనుకూల వాతావరణానికి నిదర్శనమని తెలిపారు. ఎన్నాళ్లుగానో విదేశాల్లో సేవలందిస్తున్న యువత ఇప్పుడు తమ భవిష్యత్తును రాష్ట్రంలోనే నిర్మించుకోవాలని ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం కలిసి పనిచేసే ప్రతిభ ఆధారిత వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని,విశాఖలో ఇన్ఫోసిస్ విస్తరణ ప్రభుత్వ విధానాలకు లభించిన నమ్మకానికి సంకేతమని చెప్పారు. రాష్ట్రాన్ని సాంకేతికత,ఆవిష్కరణల ప్రధాన కేంద్రంగా నిలబెట్టాలన్నలక్ష్యం మరింత బలపడుతోందని ఆయన వివరించారు. మొత్తంగా ప్రభుత్వ ప్రోత్సాహం,ఇన్ఫోసిస్ వంటి సంస్థల పెట్టుబడులు,స్థానిక యువత ప్రతిభ కలిసివచ్చి విశాఖపట్నాన్ని దేశంలో కీలక సమాచార సాంకేతిక కేంద్రంగా నిలబెడుతున్నాయి.

Advertisement