మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్లో హింసను, అశాంతిని ప్రేరేపించేందుకు ఉపయోగించిన ఆయుధాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక ప్రకటన చేశాయి.
మణిపూర్లోని తిరుగుబాటు గ్రూపులు మయన్మార్ నుంచి అక్రమంగా ఆయుధాలను సేకరించినట్లు పేర్కొన్నాయి.
ఈ నెలలో మయన్మార్ మార్గంలోని మణిపూర్లో గణనీయమైన ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
తిరుగుబాటు గ్రూపులు మూడు వాహనాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను సేకరించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఆయుధాలను మణిపూర్కు రవాణా చేయడానికి ముందు మయన్మార్-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న బ్లాక్ మార్కెట్ నుంచి తీసుకొచ్చినట్లు తెలిపాయి.
మణిపూర్
భారత్-మయన్మార్ సరిహద్దులో ప్రత్యేక నిఘా
ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికతో సరిహద్దు వెంబడి అస్సాం రైఫిల్స్ దళాలు అప్రమత్తమయ్యాయి. భారత్-మయన్మార్ సరిహద్దులో ప్రత్యేక నిఘా పెట్టాయి.
ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి ఒక ఐఆర్బీ సిబ్బందితో సహా నలుగురిని భద్రతా బృందం అరెస్టు చేసింది. ఇంఫాల్ తూర్పు జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా వీరిని అరెస్టు చేశారు.
ఆయుధాల స్మగ్లర్ల ముఠా ఉనికికి సంబంధించి ఒక పక్కా సమాచారంతో ఇంఫాల్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ కమాండో, హీంగాంగ్ పోలీసులు, 16వ జాట్ రెజిమెంట్ సంయుక్త బృందం కైరాంగ్ అవాంగ్ లీకై, ఖోమిడోక్, హీక్రుమాఖోంగ్లలో సోదాలు నిర్వహించింది.
ఈ సోదాల్లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, రూ.2.5 లక్షల నగదు, కొన్ని మొబైల్ ఫోన్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు.