Visakhapatnam: పర్యాటక రంగానికి ఊతం.. విశాఖ నుంచి సింగపూర్కు పర్యాటక క్రూజ్
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం నుంచి అంతర్జాతీయ క్రూజ్ పర్యాటకానికి త్వరలోనే శ్రీకారం చుడనుంది. ఈ దిశగా విశాఖ పోర్టు పరిధిలో అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ను ఇప్పటికే సిద్ధం చేశారు. దేశీయంగా కొన్ని క్రూజ్ సేవలు కొనసాగుతున్న నేపథ్యంలో, జులై 15 నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభం కానున్నాయి. ఇది విశాఖ పర్యాటక రంగానికి కీలక మలుపుగా మారనుందని పర్యాటక శాఖ భావిస్తోంది. ఈ ప్రయాణాన్ని కార్డేలియా క్రూజ్ నిర్వహించనుంది. జులై 15న విశాఖ అంతర్జాతీయ టెర్మినల్ నుంచి బయలుదేరే ఈ నౌక మొదట చెన్నై చేరుకుంటుంది. అక్కడ రెండు రోజుల పాటు నిలిచిన తర్వాత, తదుపరి ప్రయాణం ప్రారంభమవుతుంది.
వివరాలు
14 రోజుల అంతర్జాతీయ పర్యటన
చెన్నై నుంచి బయలుదేరిన నౌక 19, 20, 21 తేదీల్లో సముద్రంలో ప్రయాణిస్తూ మూడు రోజులు గడుపుతుంది. అనంతరం 22, 23 తేదీల్లో థాయిలాండ్లోని ఫుకెట్లో నిలుస్తుంది. ఆ తర్వాత 24న మలేసియాలోని లాంకావి చేరుకుని, 26న కౌలాలంపూర్కు చేరుకుంటుంది. తదుపరి 27, 28 తేదీల్లో సింగపూర్లో ఈ నౌక నిలిచి, మొత్తం 14 రోజుల అంతర్జాతీయ పర్యటనను పూర్తి చేస్తుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యటనల సంస్థల సంఘం అధ్యక్షుడు కె. విజయమోహన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
వివరాలు
థాయ్లాండ్, మలేసియాలకు వీసా అవసరం లేదు
ఈ క్రూజ్ ప్రయాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ సేవలు అందుబాటులోకి రావడం ఆనందకరమని తెలిపారు. ఈ ప్రయాణంలో పాల్గొనాలనుకునే వారు నౌక బయలుదేరే సమయానికి కనీసం ఆరు నెలల గడువు ఉన్న పాస్పోర్టు కలిగి ఉండాలి. థాయ్లాండ్, మలేసియాలకు వీసా అవసరం లేదు. అయితే సింగపూర్కు చేరుకున్న తర్వాత అక్కడే వీసా పొందే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.