Rajasthan: జైషే కమాండర్ను పెళ్లి చేసుకునేందుకు పాక్ వెళ్లాలని ప్లాన్.. జైపూర్ మహిళ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) స్లీపర్ సెల్తో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలతో జైపూర్కు చెందిన 38 ఏళ్ల మహిళను రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. పాకిస్థాన్కు చెందిన ఓ ఉగ్రవాద కమాండర్ను వివాహం చేసుకోవడానికి నేపాల్ మార్గం ద్వారా పాకిస్థాన్ వెళ్లేందుకు ఆమె ప్రణాళిక రూపొందించుకున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థలు అందించిన విశ్వసనీయ సమాచారంతో జైపూర్ శివారులో నివసిస్తున్న బబితా ధాకడ్ అలియాస్ ఖదీజాను ఏటీఎస్ అధికారులు గత వారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేసి, ప్రస్తుతం పోలీసు కస్టడీలో విచారిస్తున్నారు.
వివరాలు
ఆన్లైన్లో చాటింగ్
నిందితురాలి వద్ద స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించగా, ఆమె మొబైల్ ఫోన్లో పాకిస్థాన్కు చెందిన పలువురు వ్యక్తుల ఫోన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్కు సన్నిహిత బంధువైన యూసుఫ్ అజహర్,అలాగే భారత భద్రతా సంస్థలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఉగ్రవాది ఖారీ జరార్కు సంబంధించిన నంబర్లు కూడా ఆమె కాంటాక్ట్స్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా అబు ఉబైదా అనే వ్యక్తితో ఆమె తరచూ ఆన్లైన్లో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. ఆ పరిచయం క్రమంగా భావోద్వేగ బంధంగా మారడంతో అతడిని వివాహం చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఆన్లైన్ ద్వారా తీవ్రవాద భావజాలానికి ఆకర్షణ
ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి మధ్యకాలంలో నేపాల్,సౌదీ అరేబియా లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మార్గాల ద్వారా పాకిస్థాన్ చేరుకోవాలని బబిత ప్రణాళిక రూపొందించినట్లు ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్లో ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితురాలైన ఆమె, తన పేరును కూడా 'ఖదీజా'గా మార్చుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సంగనేర్ సమీపంలోని సీతాపుర లేదా వాటికా ప్రాంతంలో నివసిస్తున్న బబిత సాధారణ గృహిణి అని అధికారులు తెలిపారు.
వివరాలు
డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్న ఏటీఎస్
ఆమె అరెస్టుకు కొన్ని వారాల ముందే నిఘా పెట్టి ప్రతి కదలికను గమనించినట్లు వెల్లడించారు. ఉగ్రవాద నెట్వర్క్ ఆమెను డిజిటల్ లేదా ఇతర సహాయక కార్యకలాపాలకు ఉపయోగించాలనుకుందా అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వాట్సాప్ చాట్లు, మొబైల్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తూ ఏటీఎస్ విచారణను మరింత వేగవంతం చేసింది.