Jaishankar: అందరినీ విడిపిస్తాం: ఖతార్లో మరణశిక్ష పడిన బాధిత కుటుంబాలతో జైశంకర్
గుఢచర్యం అభియోగాలతో ఖతార్లో 8మంది భారత మాజీ నావికాదళ సిబ్బందికి ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. మరణశిక్ష పడిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులను భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం కలుసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఖతార్లో శిక్షపడిన 8 మంది భారతీయుల కుటుంబాలతో సోమవారం ఉదయం సమావేశమయ్యానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ కేసుకు అత్యంత ప్రాముఖ్య ఇస్తుందని వివరించారు. వారి విడుదలకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోందని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అలాగే బాధితుల కుటుంబ సభ్యులతో ప్రభుత్వం అన్ని వేళలా టచ్లో ఉంటుందని జైశంకర్ ట్విట్టర్లో రాసుకొచ్చారు.
అక్టోబర్ 26న 8మందికి మరణ శిక్ష
తమ సిబ్బందిని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ తెలిపారు. వారికి అవసరమైన న్యాయసాయాన్ని అందించేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. గూఢచర్యం ఆరోపణలతో అక్టోబర్ 26న ఎనిమిది మంది మాజీ భారతీయ నేవీ సిబ్బందికి ఖతార్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును భారతదేశం తీవ్ర దిగ్భ్రాంతికరమైనదిగా అభివర్ణించింది. ఈ విషయంలో అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తామని పేర్కొంది. ఆగస్ట్ 2022లో 8 మందిని గూఢచర్యం ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. వీరు అల్ దహ్రా అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు.