
Rajasthan: జోదా-అక్బర్లకు పెళ్లి కాలేదు.. గవర్నర్ బగాడే సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ బగాడే చరిత్రలో అక్బర్కు సంబంధించిన అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బ్రిటిష్ చరిత్రకారుల ప్రభావంతో జోధా బాయి, అక్బర్ల వివాహం వంటి పలు చారిత్రక ఘటనలు తప్పుడు రీతిలో మన చరిత్రలో నమోదు అయ్యాయన్నది ఆయన అభిప్రాయం.
రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్బర్నామాలో జోధా బాయి - అక్బర్ల వివాహం గురించి ఎలాంటి ప్రస్తావన లేదని చెప్పారు.
అయినా కూడా చరిత్ర పుస్తకాలు, సినిమాల్లో ఈ వివాహం నిజంగా జరిగిందని చూపించారని తెలిపారు. ఇది పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.
Details
దేశ చరిత్రను తారుమారు చేశారు
రాజ్పుత్ పాలకుడు భర్మల్ అనే రాజు ఒక పనిమనిషి కుమార్తెను దత్తత తీసుకుని ఆమెను అక్బర్కు ఇచ్చి వివాహం జరిపించారన్న వాదనలను ఆయన ప్రస్తావిస్తూ, దీన్ని నిజంగా నిరూపించలేమన్నారు.
ఇది 1569లో అమర్ పాలకుడు భర్మల్ కుమార్తె - అక్బర్ల వివాహానికి సంబంధించిన చరిత్రపై మళ్లీ చర్చకు దారితీసింది.
బ్రిటిష్ పాలకులు మన దేశ చరిత్రను తారుమారు చేశారని, కొంతమంది భారతీయ రచయితలు కూడా వారి ప్రభావానికి లోనయ్యారని గవర్నర్ బగాడే విమర్శించారు.
మహారాణా ప్రతాప్ - అక్బర్ల మధ్య సంధి యత్నాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Details
మహారాణా ప్రతాప్ గురించి ఎక్కువ సమాచారం లభ్యం కాలేదు
మహారాణా ప్రతాప్ అక్బర్కు లేఖ రాశాడన్న వాదనను ఖండించారు.
ఆత్మగౌరవం కోసం మహారాణా ఎప్పుడూ రాజీపడలేదన్నారు. చరిత్రలో అక్బర్ గురించి విస్తృతంగా సమాచారం ఉన్నా, మహారాణా ప్రతాప్ గురించి తక్కువగా లభిస్తోందని, ఇది ఇప్పుడు మారుతోందని తెలిపారు.
నూతన జాతీయ విద్యా విధానంతో మన సంస్కృతిని, చారిత్రక గౌరవాన్ని పరిరక్షించేలా పాఠ్యపుస్తకాలు రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గవర్నర్ హరిభావ్ బగాడే స్పష్టం చేశారు.