Loading...
CJI Surya Kant: విమర్శలకు న్యాయవ్యవస్థ దూరంగా ఉండకూడదు: సీజేఐ సూర్యకాంత్
విమర్శలకు న్యాయవ్యవస్థ దూరంగా ఉండకూడదు: సీజేఐ సూర్యకాంత్

CJI Surya Kant: విమర్శలకు న్యాయవ్యవస్థ దూరంగా ఉండకూడదు: సీజేఐ సూర్యకాంత్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యాయవ్యవస్థ విమర్శలకు దూరంగా ఉండకూడదని, దాని పనితీరును పరిశీలించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. ఆరో రామ్‌ జెఠ్మలానీ స్మారక ఉపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో పారదర్శకత, ప్రజల విశ్వాసం ఎంత ముఖ్యమో వివరించారు. ''ఒక వ్యవస్థగా న్యాయవ్యవస్థ విమర్శలకు వ్యతిరేకంగా లేదు.. ఉండకూడదు కూడా'' అని స్పష్టం చేశారు.

వివరాలు 

తీర్పుల వెనుక కారణాలను వెల్లడించాలి

కోర్టు గదులు, బహిరంగ విచారణలు నిర్వహించడం మాత్రమే పారదర్శకత కాదని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు.

న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల వెనుక ఉన్న కారణాలను కూడా పరిశీలించే అవకాశం ఉండాలని పేర్కొన్నారు.

''కోర్టు తీర్పును ప్రకటించి.. దాని వెనుక ఉన్న కారణాలను తన వద్దే ఉంచుకుంటే, ఇతర విషయాల్లో ఎంత చేసినా అది పూర్తిస్థాయి పారదర్శకత కాదు'' అని వివరించారు.

తమ నిర్ణయాల వల్ల ప్రభావితమయ్యే వారికి తీర్పుల వెనుక ఉన్న ఆలోచనా విధానాన్ని, కారణాలను తెలియజేయడానికి న్యాయస్థానాలు సిద్ధంగా ఉండాలని అన్నారు.

వివరాలు 

ప్రజల విశ్వాసం.. ఆమోదం ఒక్కటి కాదు

ప్రజల విశ్వాసానికి, ప్రజల ఆమోదానికి మధ్య తేడా ఉందని సీజేఐ పేర్కొన్నారు.

ప్రజలకు నచ్చే తీర్పులు ఇవ్వడం వల్ల లేదా వారు కోరుకున్న ఫలితాలు అందించడం వల్ల కోర్టులు విశ్వాసాన్ని పొందవని అన్నారు.

కేసులో ఓడిపోయినప్పటికీ.. తమపై తీసుకున్న నిర్ణయ ప్రక్రియ న్యాయంగా జరిగిందని ప్రజలు భావించినప్పుడే నిజమైన విశ్వాసం ఏర్పడుతుందని చెప్పారు.

''తాము కోరుకున్న ఫలితానికి పూర్తిగా భిన్నమైన తీర్పు వచ్చినా.. కేసులో ఓడినవారు, తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న ప్రక్రియ న్యాయంగా జరిగిందని నమ్ముతూ బయటకు వెళ్లినప్పుడే కోర్టు విశ్వాసాన్ని పొందుతుంది. అది ఎంతో విలువైనది'' అని అన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

గెలుపు కంటే న్యాయమైన ప్రక్రియే ముఖ్యం

ప్రజలు చట్టాన్ని ఎందుకు గౌరవిస్తారనే అంశంపై న్యాయ నిపుణుడు టామ్‌ ఆర్. టైలర్‌ చేసిన పరిశోధనను కూడా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రస్తావించారు.

కేసులో ఓడిపోయినా.. విచారణ, నిర్ణయ ప్రక్రియ న్యాయంగా జరిగిందని భావించే వ్యక్తులకు న్యాయవ్యవస్థపై నమ్మకం కొనసాగుతుందని చెప్పారు.

''కోర్టుకు చట్టబద్ధతను తెచ్చేది గెలుపు కాదు.. న్యాయమైన ప్రక్రియే'' అని ఆయన పేర్కొన్నారు.

న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసం, గౌరవం నిలవాలంటే ఫలితం కంటే న్యాయబద్ధమైన ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

న్యాయం జరగడమే కాదు.. జరిగినట్లు కనిపించాలి

న్యాయం చేయడమే కాకుండా.. అది జరిగినట్లు కూడా కనిపించాలనే సూత్రాన్ని సీజేఐ ప్రస్తావించారు.

1924లో వెలువడిన ఇంగ్లాండ్‌ తీర్పు R v. Sussex Justices కేసు ఈ సూత్రానికి ముఖ్యమైన ఉదాహరణగా నిలిచిందని తెలిపారు.

న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంలో ప్రజల అభిప్రాయం కూడా కీలకమని అన్నారు.

''వందేళ్లు గడిచినా.. ఒక నిర్ణయం సరైనదా కాదా అనే దానికంటే ఎక్కువ అంశాల ఆధారంగా దాన్ని అంచనా వేయడానికి ఆ కేసు ఇప్పటికీ కారణంగా నిలుస్తోంది'' అని చెప్పారు.

వివరాలు 

పారదర్శకతను మీడియా పరిశీలనతో కలపొద్దు

పారదర్శకత అంటే కేవలం మీడియా దృష్టి లేదా వార్తా కవరేజీ కాదని జస్టిస్‌ సూర్యకాంత్‌ హెచ్చరించారు.

మీడియా తీవ్రంగా దృష్టి సారించడం వల్ల కొన్ని సందర్భాల్లో విచారణపై ప్రజల్లో ఏకపక్షమైన లేదా అన్యాయమైన అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.

''తమకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్న మీడియాకు పూర్తిగా తెరిచి ఉంచిన కోర్టు గది.. నిజంగా న్యాయమైన కోర్టు గదితో సమానం కాదు'' అని వ్యాఖ్యానించారు.

నిజమైన పారదర్శకత అంటే కేవలం మీడియా కవరేజీకి అవకాశం ఇవ్వడం కాకుండా.. న్యాయమైన ప్రక్రియ, స్పష్టమైన కారణాలు, ప్రజల విశ్వాసాన్ని కాపాడే విధానం ఉండాలని సీజేఐ స్పష్టం చేశారు.

ADVERTISEMENT