Kalvakuntla kavitha: కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి: ఎమ్మెల్సీ కవిత ధ్వజం
కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉన్నట్లు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక.. అయోమయంలో ఉన్నట్లు పేర్కొన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్తో ఉండాలా? వద్దా? అనే విషయాన్ని తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైనా కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. సనాతన ధర్మం విషయంలో రాహుల్ గాంధీ తన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎంకే నేతలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదన్నారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలని అవహేళన చేసినప్పుడు కాంగ్రెస్ ఎందుకు మౌనం వహించిందన్నారు.
రాహుల్ గాంధీ ఎన్నికలప్పుడే కనిపిస్తారు: కవిత
దేశాన్ని ఏకం చేయడానికే భారత్ జోడో యాత్ర చేసినట్లు రాహుల్ గాంధీ చెబుతున్నారని, కానీ ఇండియా కూటమిలోని వారి మిత్రపక్షం డీఎంకే అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు కవిత ఆరోపించారు. భారత్ జోడో యాత్ర అనేది రాహుల్ గాంధీ కేవలం ప్రచారం కోసం మాత్రమే అని విమర్శించారు. రాహుల్ గాంధీ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారన్నారు. అందుకే రాహుల్ను 'ఎన్నికల గాంధీ'గా పిలుస్తారన్నారు. హిందీ రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికుల పట్ల తమకు గౌరవం ఉందని, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ జవాబుదారీగా ఉండాలని కవిత డిమాండ్ చేశారు.