
Karnataka:బెంగళూరు 'నమ్మ మెట్రో' పేరు మార్పు ప్రతిపాదన.. 'బసవ మెట్రో'గా నామకరణం చేయాలని ప్రభుత్వ నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, రాజధాని బెంగళూరులో ప్రసిద్ధి చెందిన 'నమ్మ మెట్రో' పేరును మార్చే యోచనలో ఉంది. రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన 12వ శతాబ్దపు సామాజిక సంస్కర్త, కవి బసవేశ్వరుని గౌరవార్థం ఈ మెట్రోకు 'బసవ మెట్రో' అని పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా బసవన్న తత్వాలు, వారసత్వం ప్రజల జీవితాల్లో మరింతగా ప్రతిబింబించాలని, ఆయన ఆశయాలను సమాజానికి దగ్గర చేసుకోవాలని తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టంగా తెలిపారు.
వివరాలు
ప్రాజెక్టు కేంద్ర‑రాష్ట్ర ఉమ్మడి భాగస్వామ్యం
'బసవ సంస్కృతి ప్రచార ఉద్యమం-2025' ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. "మన మెట్రోకు 'బసవ మెట్రో' అని పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నాను. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయితే, ఈరోజే స్వయంగా నేనే ఈ ప్రకటన చేసేవాడిని" అని తెలిపారు. ఈ ప్రాజెక్టు కేంద్ర‑రాష్ట్ర ఉమ్మడి భాగస్వామ్యంతో నడుస్తున్నందున, కేంద్రం ఆమోదం అవసరమని ఆయన వివరించారు.
వివరాలు
రాజ్యాంగంలో బసవన్న ఆశయాలు
బసవన్న బోధనలపై తనకు అపారమైన విశ్వాసం ఉందని, ఆయన చెప్పిన సమానత్వ సూత్రాలు కేవలం చరిత్రలో మాత్రమే కాదు, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా సమాజానికి వర్తిస్తాయనిఅన్నారు. "బసవన్న ఆశయాలు భారత రాజ్యాంగ విలువలతో సమానమైనవి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ ప్రధాన సూత్రాల కోసం బసవన్న కృషి చేశారు. కులవర్గాల భేదం లేకుండా సమాజ నిర్మాణాన్ని ఆయన కలిగి ఉన్న ఆశయంగా పేర్కొన్నారు. అందుకే డాక్టర్ అంబేద్కర్ కూడా తన రాజ్యాంగంలో బసవన్న ఆశయాలను ప్రతిబింబింపజేశారు" అని ముఖ్యమంత్రి వివరించారు.
వివరాలు
వచ్చే ఏడాది వచన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటన
ప్రజా సంక్షేమానికి బసవన్న తత్వం ఆధారంగా ప్రభుత్వం పనిచేస్తోందని సిద్ధరామయ్య గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం బసవ జయంతి రోజున జరగడం, అలాగే అన్ని వర్గాల పేదలకు సమాన అవకాశాలను కల్పించే విధంగా అనేక సంక్షేమ పథకాలు, గ్యారెంటీలు అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బసవన్న చిత్రాలను ప్రదర్శించడం ఆవశ్యకమని ప్రకటించారు. వచ్చే ఏడాదిలో బసవ తత్వ అధ్యయనానికి ప్రత్యేక 'వచన విశ్వవిద్యాలయం' స్థాపించేందుకు ఆమోదం ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసును ఆమోదిస్తే, బెంగళూరులోని రవాణా వ్యవస్థకు బసవన్న బోధించిన సమానత్వ తత్త్వాలతో ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.