వాతావరణం: ఐఎండీ జారీ చేసే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్ లు అంటే ఏమిటో తెలుసా
వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులను ముందస్తుగా చెప్పే సందర్భాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివిధ రంగులతో అలెర్ట్స్ జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న క్రమంలో ఎడతెరిపి లేని వర్షాలు, మరోవైపు సముద్రాల్లో తుపాను తదితర అంశాలపై ఐఎండీ ఎప్పటికప్పుడు తాజా రిపోర్ట్ అందిస్తుంటుంది. అయితే వర్షాలు కురిసే ప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ వారీగా అలెర్ట్ వార్నింగ్ లను జారీ చేస్తారు. మంగళవారం దిల్లీలో యమునా నది ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. మరో 2 రోజులూ వానలు కురువనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాజధానిలో రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. వివిధ ఉత్తరాది రాష్ట్రాలకు ఎల్లో సూచికను చూపించింది.
వర్షం తీవ్రతను తెలిపేందుకు మొత్తం 4 రకాల అలెర్ట్ లు ఉంటాయి
1.గ్రీన్ అలెర్ట్ : 24 గంటల వ్యవధిలో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే క్రమంలో గ్రీన్ అలెర్ట్ సూచిస్తారు. దీనికి ముందస్తు అప్రమత్తత అవసరం ఉండదు. 2. ఎల్లో అలెర్ట్ 64.5 మి.మీ నుంచి 115.5 మిమీ వర్షపాతానికి ఎల్లో అలెర్ట్ జారీ చేస్తారు.అప్రమత్తంగా ఉండాలని అర్థం. 3.ఆరెంజ్ అలెర్ట్ 115.6 మి.మీ నుంచి 204.5 మిమీ వర్షపాతానికి ఆరెంజ్ అలెర్ట్ ప్రకటిస్తారు. రోడ్లు, రైలు, వాయు మార్గాలపై వర్ష ప్రభావం ఉంటుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొచ్చని సూచన. 4.రెడ్ అలెర్ట్ 204.5 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. భారీ వానలకు ప్రాణ నష్టానికి అవకాశం ఉందని చెప్పేందుకు సూచిస్తారు.
వాతావరణం, భౌగోళిక స్థితిగతులు, నీటి వనరులపై కలర్ కోడింగ్ ద్వారానే సూచనలు
రంగుల ద్వారానే భారత వాతావరణ శాఖ వర్ష తీవ్రతపై సూచనలు అందిస్తుంది. ఈ మేరకు వాతావరణంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు, వాటి ద్వారా జరిగే నష్టాలను ముందస్తుగానే పసిగట్టి ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఇందులో భాగంగానే వర్షపాతంలో నమోదయ్యే తీవ్రతను తెలియజేసేందుకు కలర్ కోడింగ్ పద్ధతిని భారత వాతావరణ శాఖ ఉపయోగిస్తుంటుంది. వాతావరణ పరిస్థితులు, భౌగోళిక స్థితిగతులు, నీటి వనరులకు సంబంధించిన స్థాయిలను ప్రకటించేందుకు రంగుల ఆధారంగానే సూచనలు అందుతాయి. భారతదేశంలో విపత్తు నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగానికి ముందస్తు సమాచారాన్ని సైతం ఐఎండీ అందజేస్తుంది. ఇందుకు అవసరమైన సహాయక చర్యలు తీసుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది.