Kochi university: కొచ్చిన్ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం క్యాంపస్లో నిర్వహించిన ఫెస్టివల్లో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మరణించారు. మరో 64మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరణించిన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరు బాలికలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. యూనివర్సిటీ ఫెస్ట్కు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ హాజరు కాగా.. విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. యూనివర్సిటీ ఓపెన్-ఎయిర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. శనివారం రాత్రి అకస్మాత్తుగా వర్షం పడటంతో విద్యార్థులు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో తొక్కిలలాట జరిగినట్లు పోలీసులు చెప్పారు.
సీఎం పినరయి విజయన్ సంతాపం
యూనివర్శిటీలో నలుగురు విద్యార్థుల మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రులతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. యూనివర్సిటీలో పరిస్థితిని తెలుసుకోవడానికి పరిశ్రమల మంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి యూనివర్సిటీకి వెళ్తున్నారని సీఎం ట్విట్టర్ (ఎక్స్)లో పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు మరణించడంపై ఈ ఘటనపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు.