KTR: కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పుట్ట: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ భవన్లో ఆదివారం తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని 'స్వేదపత్రం' పేరుతో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు ఉద్దేశ పూర్వకంగా బీఆర్ఎస్ పాలనను బద్నాం చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పుట్టగా అభివర్ణించారు. శ్వేతపత్రం ఒక అంకెల గారడీ అని పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను అసెంబ్లీ వేదికగానే తాము సమాధానం చెప్పినట్లు వివరిచారు.
కోట్లమంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం: కేటీఆర్
శ్వేతపత్రంపై అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసుకొని పోయినట్లు కేటీఆర్ ఎద్దేవా చేశారు. కోట్లమంది చెమటతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. అభివృద్ధి తీరును వివరించేందుకే తాము స్వేదపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వివరించారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర స్థూల రుణం రూ.3.17 లక్షల కోట్ల అయితే.. కాంగ్రెస్ దాన్ని రూ.6.70 లక్షల కోట్లుగా చూపిస్తోందని ఆరోపించారు. లేని అప్పును, ఉన్నట్లుగా చూపించి.. బట్టకాల్చి మీద వేస్తున్నారన్నారు. పౌర సరఫరాల సంస్థకు ఉన్న అప్పు కేవలం రూ.21,029 కోట్లు మాత్రమే అని కేటీఆర్ అన్నారు. కానీ దాన్ని రూ.51వేల కోట్లు అంటూ తప్పు లెక్కలు చెబుతున్నారన్నారు. తెలంగాణలో గత పదేళ్లలో చేసిన ఖర్చు రూ.13,72,930 కోట్లుగా కేటీఆర్ వివరించారు.