
Darjeeling: డార్జిలింగ్లో భారీ వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండచరియలు.. 17 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
భారీ వర్షాలు పశ్చిమ బెంగాల్, నేపాల్ను అతలాకుతలం చేశాయి. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఘటనా స్థలాల్లో భద్రతా బలగాలు, సహాయక విభాగాలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. మరోవైపు సిలిగుడి-మరిక్ ప్రాంతాలను కలిపే బాలసోన్ నది ఇనుప వంతెన దూదియా వద్ద కుప్పకూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కలింపాంగ్ జిల్లాలో పరిస్థితి దారుణంగా మారింది. 717 జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపోయి, సిక్కిం-సిలిగుడి మార్గంలో రాకపోకలు విరమించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్నాయి. తీస్తా, మాల్ పర్వత ప్రాంత నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.
Details
సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
భూటాన్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పశ్చిమబెంగాల్కు ఆకస్మిక వరదల హానీ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు తగ్గేవరకు డార్జిలింగ్లోని పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. తూర్పు నేపాల్లోని కోషి ప్రావిన్స్లో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపోయాయి. ఈ ఘటనల్లో 14 మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. ఇలామ్ జిల్లాలో ఐదుగురు, పటేగాన్, మన్సేబుంగ్, డ్యూమా, ధుసుని, రత్మాటే, ఘోసాంగ్ ప్రాంతాల్లో తొమ్మిది మంది మరణించారు. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడటంతో హెలికాప్టర్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.