Indiramma housing scheme: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. శనివారం సచివాలయంలో గృహనిర్మాణ శాఖతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు, ఆరు హామీల్లో, కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500-ఎల్పీజీ సిలిండర్ను మహాలక్ష్మి హామీ కింద ప్రారంభించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమాను రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచింది.
వందరోజుల్లో ఐదో హామీ అమలు
గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించింది. అలాగే కొన్ని వర్గాలకు చేయూత పింఛన్లు పెంచింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేయనున్న ఐదో హామీ ఇదే కావడం గమనార్హం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని అర్హులైన, నిరాశ్రయులైన వ్యక్తులందరికీ గృహనిర్మాణ పథకాన్ని వర్తింపజేయాలని, తదనుగుణంగా విధానాలను రూపొందించాలని స సీఎం అధికారులను ఆదేశించారు.