మద్యం పాలసీ కేసు: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను కొట్టేసిన దిల్లీ కోర్టు
లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియా బెయిల్ పిటిషన్ను శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దిల్లీలో రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీని అమలు చేయడంలో అవకతవకలు జరిగాయని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ కేసులో ప్రస్తుతం సిసోడియా జైలులో ఉన్నారు. మనీష్ సిసోడియా తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట వాదిస్తూ, అతను దర్యాప్తులో సహకరించారని పేర్కొన్నారు. అతని తదుపరి కస్టడీకి అవసరమయ్యే అసాధారణమైన విషయాన్ని సీబీఐ వెల్లడించలేదని వాదించారు.
కస్టడీలో ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు: సిసోడియా తరఫు న్యాయవాది
కేసుకు సంబంధించిన అన్ని రికవరీలు ఇప్పటికే పూర్తయ్యాయని, సిసోడియాను కస్టడీలో ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సిసోడియా తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసులోని ఇతర నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యిందని, సీబీఐ పిలిచినప్పుడు తాను విచారణకు హాజరవుతానని సిసోడియా తన పిటిషన్లో పేర్కొన్నారు. సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తే, దర్యాప్తు ఆటంకం కలుగుతుందని, ఈ కేసు పరిధి చాలా ఎక్కువని సీబీఐ తరఫు న్యాయవాది డీపీ సింగ్ పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు సిసోడియా అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్ను పిటిషన్ను కొట్టి వేసింది.