Page Loader
Loksabha : లొంగిపోయిన భద్రతా ఉల్లంఘన సూత్రధారి, కోల్‌కతా ఉపాధ్యాయుడు లలిత్ ఝా
Loksabha : దిల్లీ పోలీసులకు లొంగిపోయిన లోక్'సభ భద్రతా ఉల్లంఘన సూత్రధారి లలిత్ ఝా

Loksabha : లొంగిపోయిన భద్రతా ఉల్లంఘన సూత్రధారి, కోల్‌కతా ఉపాధ్యాయుడు లలిత్ ఝా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 15, 2023
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో ప్రధాన సూత్రధారి, కోల్‌కతాకి చెందిన ఉపాధ్యాయుడు లలిత్ ఝా పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు దిల్లీ నడిబొడ్డున ఉన్న 'కర్తవ్య పథ్' మార్గం గుండా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో లలిత్‌ను అరెస్టు చేసినట్లు ధృవీకరించాయి. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని స్పెషల్ సెల్‌కు అప్పగించారు. రెండు రోజులపాటు పరారీలో ఉన్న లలిత్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. లలిత్ నీమ్రానా నుంచి బస్సులో ప్రయాణించి రాజస్థాన్‌లోని నాగౌర్‌కు చివరిసారిగా వెళ్లాడు. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ హోటల్‌లో బస చేశారు. పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకుని వచ్చి లొంగిపోయాని లలిత్ చెప్పారని పోలీసులు వివరించారు.

details

వారం పాటు పోలీస్ కస్టడీ

లోక్‌సభలో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో ఇప్పటికే నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. దిగువసభలో కలకలం సృష్టించిన సాగర్ శర్మ,మనోరంజన్‌ సహా పార్లమెంట్ భవనం వెలుపల నినాదాలు చేసిన నీలమ్ దేవి, అమోల్ షిండేలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నలుగురు రంగుల పొగ డబ్బాలతో కలకలం సృష్టించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సాగర్, మనోరంజన్ లోక్‌సభ పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి వీడియోలను రికార్డు చేశారు. వీటిని సూత్రధారి లలిత్ ఝా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిందితులను ప్రశ్నించేందుకు 2వారాలపాటు కస్టడీ కోరగా కోర్టు వారం సమయమిచ్చింది. నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా (యూఏపీఏ), ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు మోపారు.